పంజాబ్లోని కపుర్తలాలో ఉన్న మాతా భద్రకాళి ఆలయ సమీపంలో, చేతిలో చంటిబిడ్డను పట్టుకుని ఉన్న ఒక మహిళపై దుకాణదారుడు కర్కశంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం రేపింది.
గుడి వద్ద పిల్లలతో ఉన్న ఆ మహిళను ఒక వ్యక్తి విచక్షణారహితంగా చెప్పుతో కొట్టి, కాలితో తొక్కిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారి తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి.
బైక్ సైడ్ మిర్రర్ను (అద్దాన్ని) పసిబిడ్డ ముట్టుకోవడమే ఈ గొడవకు కారణమని తెలిసింది. చిన్నారి ప్రమాదవశాత్తూ అద్దాన్ని తాకిందని, తాము వెంటనే దాన్ని సరిచేశామని బాధిత కుటుంబం తెలిపింది. అయితే అంతటితో ఆగని ఆ వ్యక్తి పసికందును తిట్టడమే కాకుండా, అడ్డువచ్చిన తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
చేతిలో ఏడాది చంటిపాప ఉన్నదన్న కనికరం కూడా లేకుండా ఆ మహిళపై చెప్పుతో దాడి చేసి కాలితో తొక్కినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ అమానుష ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది.
ఇదిలా ఉండగా, బాధితురాలి కుటుంబం మరో సంచలన ఆరోపణ చేసింది. నిందితుడైన దుకాణదారుడి తండ్రితో పాటు మరికొందరు తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని, రూ.20,000 ఇచ్చి రాజీ చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని బాధిత మహిళ భర్త ఆరోపించారు. ఈ బెదిరింపుల కోణంలోనూ పోలీసులు ప్రత్యేక విచారణ జరుపుతున్నారు.
