రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో జరిగిన పెళ్లి ఊరేగింపులో, కారు పైకప్పుపై బాణసంచా కాల్చడంతో కారుకు నిప్పంటుకుని పూర్తిగా కాలి బూడిదైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
హర్యానా నుంచి పెళ్లి బృందం వస్తుండగా, జుర్హరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోసింగ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పెళ్లి సంబరాల్లో భాగంగా, ఊరేగింపులో వచ్చిన కొందరు కారు పైకప్పు (రూఫ్) పైకి ఎక్కి నిలబడి బాణసంచా కాల్చారు. ఆ సమయంలో ఊహించని విధంగా టపాసుల నిప్పురవ్వలు కారు లోపలి భాగంలో పడ్డాయి.
నిప్పురవ్వలు పడిన కొద్ది సెకన్లలోనే మంటలు కారు అంతటా వేగంగా వ్యాపించి, క్షణాల్లో వాహనం పూర్తిగా అగ్నిగోళంగా మారిపోయింది. కనురెప్పపాటు కాలంలో కారు భగ్గుమనడంతో, ఊరేగింపులో పాల్గొన్న జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.
అకస్మాత్తుగా కారు తగలబడిపోవడంతో పెళ్లి ఊరేగింపులో ఉన్న వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ అగ్నిప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా ఇతర నష్టాలు ఏమైనా జరిగాయా అనే వివరాలు వెంటనే తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
