గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థిని, తన సహాధ్యాయి (క్లాస్మేట్) పై మోసం మరియు బెదిరింపులకు పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఆ నమ్మకంతో తన వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలను కాజేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరూ ఒకే విద్యాసంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తోటి క్లాస్మేట్తో ఏర్పడిన పరిచయం క్రమంగా సాన్నిహిత్యానికి దారితీసింది. అతను పెళ్లి చేసుకుంటానని బాస చేయడంతో విద్యార్థిని అతడిని పూర్తిగా నమ్మింది. అనంతరం ఆ యువకుడు ఆమెను ఒక హోటల్కు తీసుకెళ్లి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత నుంచి ఆమె వద్ద డబ్బులు, నగలు వసూలు చేయడం మొదలుపెట్టాడని ఆరోపించింది.
పలు కారణాలు చెబుతూ తన వద్ద నుంచి విడతల వారీగా సుమారు రూ. 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నాడని ఆమె పేర్కొంది. తీసుకున్న నగలను తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతూ, నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడం, రూ. 14 లక్షల విలువైన నగల స్వాహా, బెదిరింపుల కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో పూర్తి విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply