మధ్యప్రదేశ్లోని నివారి జిల్లాకు చెందిన ఆర్తి కుష్వాహా, 2020లో నర్సింగ్ రిక్రూట్మెంట్ పరీక్ష రాశారు.
అయితే, పరీక్ష జరిగి ఏళ్లు గడుస్తున్నా ఆ ఫలితాలు విడుదల కాకుండా నిలిచిపోయాయి. ప్రభుత్వ పరీక్ష ఫలితాలు సకాలంలో రాకపోవడంతో, తన కలలన్నింటినీ మూటగట్టుకుని కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వివాహం చేసుకుని గృహిణిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆర్తి, ఆరేళ్లు గడిచినా తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. “నేను నర్సుగా మారి ప్రజలకు సేవ చేయాలనుకున్నాను, కానీ కుటుంబం నన్ను కోడలిగా మార్చేసింది” అని వాపోయిన ఆమె, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. మధ్యప్రదేశ్ విద్యాశాఖ/ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి పెండింగ్లో ఉన్న నర్సింగ్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఆమె కన్నీటితో వేడుకున్నారు.
ఆర్తి వెలిబుచ్చిన ఈ ఆవేదన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల జాప్యం వల్ల దేశంలో ఎందరో గ్రామీణ యువతుల కలలు ఎలా కల్లలవుతున్నాయో కళ్లకు కట్టింది. ఎన్నో ఏళ్లు కష్టపడి చదివినా ఫలితాలు రాక, కుటుంబ ఒత్తిళ్లకు తలొగ్గి తమ లక్ష్యాలను వదులుకుంటున్న వేలాది మంది మహిళల గొంతుకగా ఆమె విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట నిలిచింది.

Leave a Reply