పుణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో ఆగస్టు 19న ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు.
ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అకస్మాత్తుగా అతనితో గొడవకు దిగారు. “మా వైపు ఎందుకు అలా చూస్తున్నావ్?” అని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగి, చంపేస్తామని బెదిరించి అతని వద్దనున్న రూ.15,000 నగదును లాక్కుని పరారయ్యారు.
ఈ ఘటనతో షాక్కు గురైన బాధితుడు వెంటనే ఎరవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని దాదాపు 87 సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ద్వారా నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు, వారు హడప్సర్ ప్రాంతంలో దాక్కున్నట్లు గుర్తించారు. ఎరవాడ, హడప్సర్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేసి నిఖిల్, అయాన్ నాసిర్ షేక్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాము ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి వద్ద దోపిడీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. పట్టుబడిన ఇద్దరిపై గతంలోనూ పలు నేరారోపణలు ఉన్నట్లు తేలింది. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply