తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక కిరాతక హత్య ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, ఉద్రిక్తతను రేకెత్తించింది.
అక్రమ సంబంధం వ్యవహారంలో కక్ష పెంచుకున్న ఒక ముఠా, పట్టపగలు నడిరోడ్డుపై ప్రజలు చూస్తుండగానే ఒక యువకుడిని పరుగులు తీయించి మరీ వేటకొడవళ్లతో నరికి చంపింది.
వివరాల్లోకి వెళితే.. సిట్రత్తూరు గ్రామానికి చెందిన మారి అలియాస్ రూబన్ (32) పెయింటర్గా పనిచేస్తుండేవాడు. ఇతనిపై గతంలో కొన్ని గొడవలకు సంబంధించిన కేసులు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన అతడు నిబంధనల ప్రకారం రోజూ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టి వస్తున్నాడు. ఎప్పటిలాగే నిన్న ఉదయం 11 గంటల సమయంలో తన స్నేహితుడు వెంకటేశన్తో కలిసి బైక్పై వెళ్లి పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి బయలుదేరాడు. వెంకటేశన్ బైక్ నడుపుతుండగా, మారి వెనుక కూర్చున్నాడు.
పాగల్మేడు బస్టాప్ సమీపంలో బైక్ వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు వారి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే కారులోంచి దిగిన ఐదుగురు దుండగుల ముఠా కత్తులు, కొడవళ్లు వంటి మారణాయుధాలతో మారిని చుట్టుముట్టింది. ప్రాణభయంతో మారి పరుగులు తీయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ ముఠా పట్టపగలు స్థానికుల ముందే అతడిని వెంటాడి విచక్షణారహితంగా నరికింది. ఈ దాడిలో మారి చేతి మణికట్టు తెగి వేరుపడటంతో పాటు, ముఖాన్ని సైతం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేశారు. తీవ్ర రక్తస్రావంతో అతడు ఘటనా స్థలంలోనే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు.
హత్య చేసిన అనంతరం ఆ ముఠా తిరిగి కారులో ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ కంగారులో వారు నడుపుతున్న కారు పక్కనే ఉన్న ఒక ఇంటి గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గుమిగూడి వారిలో ముగ్గురిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల చేతికి చిక్కిన కీళానూరు ప్రాంతానికి చెందిన దీనా (25), నరేష్ (20), విక్కీ అలియాస్ కళానిధి (23)లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరారైన మేలానూరుకు చెందిన పేరరసు (19), రాజ్కుమార్ (20)లను సైతం గాలించి అరెస్ట్ చేశారు.
పోలీసుల ముమ్మర విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు దీనా వివాహిత అయిన సోదరి దీపాతో మారి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన దీపా భర్త, ఆమెను కొట్టి పుట్టింటికి పంపించేశాడు.
తీవ్ర మనస్తాపానికి గురైన దీపా గతేడాది డిసెంబర్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన సోదరి చావుకు కారణమైన మారిపై పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే దీనా తన అనుచరులతో కలిసి ఈ పథకం వేసి అతడిని కడతేర్చినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. హత్యకు గురైన పెయింటర్ మారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Leave a Reply