మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్థానిక వాగు వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వేరే దారి లేక ప్రమాదకరమైన నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థినులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వాగు దాటుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
గత శనివారం కురిసిన భారీ వర్షం తర్వాత వాగులో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ బడికి వెళ్లడానికీ, తిరిగి ఇంటికి రావడానికీ విద్యార్థులు అదే మార్గాన్ని ఉపయోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. చిన్న పిల్లలను తల్లిదండ్రులు భుజాలపై, చేతులపై ఎత్తుకుని వాగు దాటిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీంతో చిన్నారుల భద్రతపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్య కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా, ప్రతి ఏటా దాదాపు నాలుగు నెలల పాటు ఇలాగే కొనసాగుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. వాగులో నీటి ప్రవాహం పెరిగిన సమయాల్లో విద్యార్థులే కాకుండా గర్భిణులు, వృద్ధులతో సహా గ్రామస్తులంతా తీవ్ర అవస్థలు పడుతున్నారని సమాచారం. కొన్ని సమయాల్లో ప్రవాహం మరీ ఎక్కువై గ్రామం దాటి బయటకు వెళ్లడమే కష్టతరంగా మారుతోంది. కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. లక్నాదోన్ పంచాయతీ యూనియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో విచారణ బృందాన్ని ఘటనా స్థలానికి పంపారు. పరిశీలన నివేదిక అందిన తర్వాత జిల్లా యంత్రాంగానికి వంతెన నిర్మాణ ప్రతిపాదనలు సమర్పిస్తామని తెలిపారు. ఆ ప్రాంతంలో దాదాపు 75 మీటర్ల పొడవైన వంతెన అవసరమని అధికారులు పేర్కొన్నారు. ప్రతి వర్షాకాలంలో పిల్లలు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఈ ప్రమాదకర పరిస్థితులకు స్వస్తి పలికేలా అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply