వామ్మో..! 200 ఏళ్ల నాటి చారిత్రక కోటను తాళ్లతో లాగిన జపాన్ ప్రజలు — 360 టన్నుల బరువును కదిలించిన 1,800 మంది! అద్భుతమైన వీడియో!

చారిత్రక కట్టడాలను కాపాడుకోవడానికి ప్రజలంతా ఒక్కటైతే ఎంతటి అద్భుతాలు చేయవచ్చో చెప్పడానికి జపాన్‌లోని అయోమోరి ప్రిఫెక్చర్‌లో జరిగిన ఈ ఘటనే ఒక గొప్ప నిదర్శనం.

జపాన్‌కు చెందిన ప్రసిద్ధ ‘హిరోసాకి కోట’ ప్రధాన గోపురాన్ని (360 టన్నుల బరువు) దాని అసలు రాతి పునాది వైపునకు తిరిగి చేర్చేందుకు దాదాపు 1,800 మంది వాలంటీర్లు చేతులు కలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పట్టాలపై (ట్రాక్స్) ఉంచిన ఈ కోటను.. ప్రజలు తాళ్లతో లాగుతూ శనివారం 1.13 మీటర్లు, ఆదివారం 1.09 మీటర్లు—మొత్తం రెండు రోజుల్లోనే 2 మీటర్లకు పైగా విజయవంతంగా కదిలించి రికార్డు సృష్టించారు.

ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అవసరమైన సంఖ్య కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఎంపిక చేసిన 1,800 మందిలో స్థానిక జపనీయులతో పాటు ఆగ్నేయాసియా, ఐరోపా, ఇతర దేశాల ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరంతా 30 మీటర్ల పొడవైన తాళ్లను పట్టుకుని, ఒక్కో బ్యాచ్‌కు 80 మంది చొప్పున వంతులవారీగా కోటను లాగారు.

ఈ కోట జపాన్ జాతీయ సాంస్కృతిక సంపద. దీనికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, కూల్చకుండా ఉన్నదున్నట్లుగా తరలించేందుకు ‘హికియా’ (Hikıya) అనే సాంప్రదాయ జపనీస్ నిర్మాణ మార్పిడి పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతిలో భవనాలను రోలర్లు లేదా పట్టాలపై పెట్టి సురక్షితంగా వేరే స్థానానికి తరలిస్తారు.

‘హిప్పారే! గెప్పారే! హిరోసాకి కోట’ పేరుతో నిర్వహించిన ప్రారంభోత్సవంలో జపాన్ రాజకుమారి హిటాచీ (కజుకో), సుగారు వంశపు 15వ అధిపతి షిన్ సుగారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ ప్రజా భాగస్వామ్య కార్యక్రమం ఆగస్టు చివరి వరకు కొనసాగనుంది. దీని ద్వారా దాదాపు 4,100 మంది కలిసి కోటను చేతులతో 5 మీటర్ల దూరం లాగుతారు. మిగిలిన 73 మీటర్ల దూరాన్ని ఈ ఏడాది చివరికల్లా యంత్రాల సహాయంతో పూర్తి చేయాలని నిర్ణయించారు. కోట రాతి గోడలలో దెబ్బతిన్న భాగాలను బాగుచేసేందుకే ఈ తరలింపు చేపట్టారు. 2015లో మొదలైన ఈ రక్షణ పనులలో భాగంగా, డిసెంబర్ 2024 నాటికి రాతి గోడల పునర్నిర్మాణం పూర్తయి, రాళ్లన్నీ వాటి అసలు స్థానాలకు చేరాయి.

1611లో నిర్మితమై సుగారు వంశానికి అధికార కేంద్రంగా ఉన్న హిరోసాకి కోట, 1627లో పిడుగుపాటుకు గురై అగ్ని ప్రమాదంలో ధ్వంసమైంది. అనంతరం 1810లో దీనిని పునర్నిర్మించారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కోట, ఈశాన్య జపాన్‌లో మిగిలి ఉన్న ఏకైక చారిత్రక కోటగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మరమ్మతుల కారణంగా పర్యాటకులను లోపలికి అనుమతించడం లేదు. ఈ పునరుద్ధరణ పనులన్నీ పూర్తయి, 2033 నాటికి ఈ కోట తిరిగి ప్రజల సందర్శనార్థం ప్రారంభం కానుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *