సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం నేటి తరం యువత తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది.
ఆ కోవలోనే, జార్ఖండ్ రాష్ట్రం గర్హ్వా జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్పై పూర్ణిమ అనే యువతి తన స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోలు చిత్రీకరిస్తోంది. ఎప్పటిలాగే విభిన్న పోజులతో రీల్స్ చేస్తున్న ఆ యువతికి, మృత్యువు రైలు రూపంలో పొంచి ఉందని వారు ఏమాత్రం ఊహించలేకపోయారు.
వీడియో తీయడంపైనే పూర్తి దృష్టి పెట్టడంతో, రాంచీ నుంచి చోపన్ వైపు అతివేగంగా దూసుకొస్తున్న ప్యాసింజర్ రైలును వారు ఏమాత్రం గమనించలేదు. రెప్పపాటు కాలంలో అక్కడికి చేరుకున్న రైలు పూర్ణిమను అత్యంత బలంగా ఢీకొట్టి గాల్లోకి విసిరేసింది. ఈ ఘోర ప్రమాద ధాటికి ట్రాక్ పక్కనున్న రాళ్లపై పడటంతో ఆమె రెండు చేతులు ఛిద్రమై తెగిపడగా, శరీరంపై తీవ్ర గాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
గమనించిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించి సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించి, ప్రస్తుతం ఐసీయూ (ICU)లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొన్ని క్షణాల సరదా కోసం, సోషల్ మీడియా లైకుల మోజులో పడి తమ అమూల్యమైన అవయవాలను, నిండు జీవితాన్ని కోల్పోయిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు యువతకు ఓ హెచ్చరికగా నిలిచింది.

Leave a Reply