కేరళ రాష్ట్రం కొచ్చిలో జైలు నుంచి తప్పించుకున్న ఒక విచారణ ఖైదీ, తన ఆధార్ కార్డును తిరిగి తీసుకునేందుకు గతంలో తనను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కే వెళ్లిన విచిత్ర సంఘటన తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది.
అసోం రాష్ట్రం ధేమాజీ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మధుర్జ్యా సోనోవాల్ అనే వ్యక్తి, ఎర్నాకులం జిల్లా పరిధిలోని ఒక ప్లైవుడ్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల సెల్ఫోన్లు దొంగిలించిన కేసులో అరెస్టయ్యాడు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆలువా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
ఈ క్రమంలో, గత 24వ తేదీ సాయంత్రం ఖైదీలకు కేటాయించే సాధారణ విరామ సమయాన్ని ఆసరాగా చేసుకుని సోనోవాల్ జైలు నుంచి పరారయ్యాడు. వంటగది మార్గం గుండా వెళ్లి ప్రహరీ గోడ దూకి అతడు తప్పించుకున్నట్లు సమాచారం. ఖైదీలను తిరిగి బ్యారక్స్లోకి పంపే ముందు లెక్కించిన సమయంలోనే అతడు కనిపించకుండా పోయినట్లు జైలు అధికారులకు తెలిసింది. దీంతో తక్షణమే అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి, అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
పరిస్థితి ఇలా ఉండగా, తప్పించుకున్న సోనోవాల్ ఊహించని విధంగా పెరుంబవూరు పోలీస్ స్టేషన్కే నేరుగా వెళ్లాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను తన ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. గతంలో తనను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం డ్యూటీలో ఉండరని, తనను ఎవరూ గుర్తుపట్టలేరని అతడు భావించినట్లు సమాచారం. మొదట స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా అతడిని వెంటనే గుర్తించలేకపోయారు. దీంతో ఆధార్ కార్డు తీసుకుని అక్కడి నుంచి సులభంగా వెళ్లిపోవచ్చని అతడు అనుకున్నాడు.
కానీ, సోనోవాల్ వేసిన లెక్క కొద్దిసేపట్లోనే తారుమారైంది. జైలు నుంచి ఖైదీ పరారైనట్లు వచ్చిన హెచ్చరిక సమాచారాన్ని, ఫొటోను చూసిన మరో పోలీస్ అధికారి అతడిని స్టేషన్లోనే గుర్తించారు. విషయాన్ని పసిగట్టిన సోనోవాల్ అక్కడి నుంచి వెంటనే మళ్లీ పరుగులు తీశాడు. పోలీసులు వెంబడించినప్పటికీ జనసంచారాన్ని, రద్దీని ఆసరాగా చేసుకుని అతడు మళ్లీ పరారయ్యాడు. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు ఎర్నాకులం, పరిసర జిల్లాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply