మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 21 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురైన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే ఆశ్రమ పాఠశాలల్లో భద్రతా లోపాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ దారుణ సంఘటన తల్లిదండ్రులతో పాటు సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను, ఆందోళనను రేకెత్తించింది.
ఈ ఆశ్రమ పాఠశాల భవనంలోని మూడవ అంతస్తులో విద్యార్థినులు బస చేస్తున్నారు. అక్కడ వంట సహాయకుడిగా పనిచేస్తున్న గణపత్ జిబ్రూ గావ్లీ అనే వ్యక్తి.. విద్యార్థినులు భోజనం చేయడానికి, ప్లేట్లు కడుక్కోవడానికి కిందకు వచ్చే సమయాన్ని ఆసరాగా చేసుకుని వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాకుండా, పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
నిందితుడి వికృత చేష్టలతో తీవ్ర వేదనకు గురైన విద్యార్థినులు ధైర్యం చేసి హాస్టల్ వార్డెన్ వద్దకు వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. వార్డెన్ వెంటనే విద్యార్థినులను షాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం సహా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని వెంటనే అరెస్టు చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మరింత దిగ్భ్రాంతికరమైన నిజం వెలుగు చూసింది. ఈ నిందితుడు గతంలోనూ ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెన్షన్కు గురైన వ్యక్తే. అలాంటి నేరపూరిత చరిత్ర ఉన్న వ్యక్తిని మళ్లీ అదే పాఠశాలలో, అది కూడా బాలికలతో సంబంధం ఉండే విధుల్లోకి ఎవరు నియమించారంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ ఆడపిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలతో సరిపెట్టకుండా.. ఈ నిందితుడికి సహకరించిన ఉన్నతాధికారులు, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply