నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న భీకర హిమపాతం, ఆకస్మిక వరదల వంటి విపత్తులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన వేళ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన ముప్పు మున్ముందు ఉందని భౌగోళిక, వ్యూహాత్మక నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
హిమాలయ పర్వత ప్రాంతాలలో చైనా చేపడుతున్న మితిమీరిన నిర్మాణ పనులు, భారీ డ్యామ్ ప్రాజెక్టులు భవిష్యత్తులో భారతదేశానికి పెను వినాశనాన్ని కలిగించవచ్చనే ఆందోళనలు ప్రస్తుతం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
చైనా తన ఆధీనంలోని టిబెట్ అటానమస్ రీజియన్లో, యార్లుంగ్ త్సాంగ్పో (భారతదేశంలో బ్రహ్మపుత్రగా పిలిచే) నదిపై ‘మెడోగ్’ (Medog) అనే భారీ జలవిద్యుత్ డ్యామ్ను అత్యంత వేగంగా నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక భూకంప ముప్పు ఉన్న అత్యంత సున్నితమైన జోన్లో సుమారు 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఆనకట్టను నిర్మిస్తుండగా.. ఇది ఒక “వాటర్ బాంబ్” (జల బాంబు) వలె పనిచేస్తుందని అంతర్జాతీయ నిపుణులు బాహాటంగా హెచ్చరిస్తున్నారు.
ఈ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోనే క్రియాశీలక భూకంప ఫాల్ట్ లైన్ (Fault Line) ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఒకవేళ చైనా ఈ మెడోగ్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తే.. భవిష్యత్తులో భూకంపాల వల్ల డ్యామ్ తెగిపోయినా లేదా వర్షాకాలంలో ఒక్కసారిగా భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేసినా అరుణాచల్ ప్రదేశ్, అసోం సహా భారతదేశ ఈశాన్య రాష్ట్రాలు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply