రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లా మెహందీపూర్ బాలాజీ ప్రాంతంలో గత ఆగస్టు 17న ఓ మహిళ రక్తపు మడుగులో ఉన్న మృతదేహం పొదల్లో లభ్యమైంది.
ఆమె ముఖంపై రాళ్లతో బలంగా కొట్టి ఛిద్రం చేయడంతో, మృతురాలిని గుర్తించడం పోలీసులకు పెను సవాలుగా మారింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. పసుపు రంగు చుడీదార్ ధరించిన ఓ మహిళ ఇద్దరు పురుషులతో కలిసి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ ఫోటోలను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలకు పంపి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
విచారణలో మృతురాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్కు చెందిన సంగీత (22)గా తేలింది. దీంతో సంగీత ప్రియుడు గజేంద్ర మీనా (28), అతని స్నేహితుడు వివేక్ మీనాను పోలీసులు దాదాపు 700 కిలోమీటర్లు ప్రయాణించి బులంద్షహర్లో అరెస్ట్ చేశారు.
గజేంద్రకు కొద్ది నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే, భార్యను వదిలేసి తనతో వచ్చేయాలని సంగీత పదే పదే ఒత్తిడి చేయడంతో.. ఆమెను మెహందీపూర్ బాలాజీకి ఆధ్యాత్మిక యాత్ర పేరుతో తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి చంపేసి, గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖాన్ని రాళ్లతో ఛిద్రం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Leave a Reply