కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన ఈరణ్ణ పడిగర్ అనే డిప్లొమా గ్రాడ్యుయేట్, సోషల్ మీడియాను అడ్డదారిలో ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించి ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ అకౌంట్ను ప్రారంభించాడు.
అందులో తాను బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో – ISRO)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నట్లు పోస్ట్లు పెట్టడం మొదలుపెట్టాడు.
“ఇస్రోలో ప్రభుత్వ ఉద్యోగం కావాలా? నన్ను సంప్రదించండి” అంటూ అతడు పెట్టిన ప్రకటనను చూసి గదగ్, విజయపుర తదితర జిల్లాలకు చెందిన ఉద్యోగార్థులైన యువతీయువకులు అతడిని సంప్రదించారు. వారితో మాట్లాడిన ఈరణ్ణ, తాను తలచుకుంటే ఇస్రోలో చాలా సులభంగా ఉద్యోగం ఇప్పించగలనంటూ మాయమాటలు చెప్పాడు. అతడి మాటలను నిజమని నమ్మిన యువతీయువకుల నుంచి ఫోన్పే (PhonePe) ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. డబ్బులు గుంజడమే కాకుండా, 30 మందికి పైగా యువతులను పక్కా ప్లాన్తో తన వలలో వేసుకుని, వారిపై లైంగిక దాడికి పాల్పడి మోసం చేసినట్లు విచారణలో వెలుగుచూసిన నిజాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
ఎన్ని రోజులైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో, డబ్బులు ఇచ్చిన బాధితులు ఈరణ్ణను గట్టిగా నిలదీయడం మొదలుపెట్టారు. ఒత్తిడి పెరిగిపోవడంతో తప్పించుకోవాలని చూసిన ఈరణ్ణ, వెంటనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను పూర్తిగా తొలగించి, ఫోన్ నంబర్లను కూడా మార్చేశాడు. అప్పుడే తాము ఒక పెద్ద మోసగాడి చేతిలో చిక్కుకున్నామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టి, విజయపురలోని నివాసంలోనే ఈరణ్ణను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా, గతంలో తాను చేసిన అప్పులను తీర్చుకునేందుకే ఈ దారుణ మోసాలకు తెరలేపినట్లు తేలింది.
అతని మొబైల్ ఫోన్ను పరిశీలించిన పోలీసులకు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్లో పలువురు మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి పెద్ద సంఖ్యలో కండోమ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఈరణ్ణను పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారిస్తుండగా, ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

Leave a Reply