ఢిల్లీలోని మౌజ్పూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక డే-కేర్ (శిశు సంరక్షణ కేంద్రం)లో, మూడేళ్ల పసిబాలుడిపై జరిగిన దారుణ దాడి తీవ్ర కలకలం రేపింది.
బాలుడి శరీరంపై తీవ్ర గాయాల గుర్తులను గమనించి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, డే-కేర్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో ఈ కర్కశ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోక్సో (POCSO) చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, డే-కేర్ డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఒక కేర్టేకర్ను అరెస్ట్ చేశారు.
డే-కేర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆ పసికందును ఉపాధ్యాయులు, కేర్టేకర్లు క్రూరంగా కొడుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి. బాలుడిని కుర్చీకి కట్టేసి, కాళ్లతో తన్నుతూ, చెంపలపై విచక్షణారహితంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. డే-కేర్ నుంచి ఇంటికి వచ్చిన బాలుడు వాంతులు చేసుకోవడంతో పాటు కళ్లు తీవ్రంగా వాచిపోవడంతో తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించారు. అయితే, ఈ అమానుష ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా.. వారు బాధ్యత తీసుకోకపోగా బాలుడిదే తప్పంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని తండ్రి కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ భయానక దాడితో ఆ మూడేళ్ల చిన్నారి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. రోజూ నిద్ర లేవగానే భయంతో ఏడుస్తుండటం, చిన్న తప్పు జరిగినా ఎక్కడ తల్లిదండ్రులు కూడా కొడతారోనని భయపడుతూ వణికిపోతున్నాడు. బాలుడి చెవి భాగంలో తీవ్రమైన వాపు ఉందని, ఆసుపత్రిలోని వైద్య పరికరాల శబ్దాలకే వణికిపోతుండటంతో కనీసం సీటీ స్కాన్ (CT Scan) వంటి పరీక్షలు కూడా చేయించలేకపోతున్నామని ఆ చిన్నారి తండ్రి రోదిస్తూ వాపోయారు.

Leave a Reply