ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నివసిస్తున్న 74 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారిలా నటిస్తూ గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేశారు.
సదరు వృద్ధుడి బ్యాంక్ ఖాతాను ఉగ్రవాద కార్యకలాపాలకు, ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కుట్రకు ఉపయోగించారంటూ ఆ ఆగంతకుడు తీవ్రంగా బెదిరించాడు.
అనంతరం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్లో మాట్లాడిన సైబర్ నేరగాళ్ల ముఠా.. ఆ వృద్ధుడిని, అతని భార్యను ఏడు రోజుల పాటు “డిజిటల్ అరెస్ట్” పేరుతో బంధించి ఎవరితోనూ మాట్లాడకుండా నియంత్రించింది. ఖాతాలోని నగదును తనిఖీ చేయాలంటూ నమ్మబలికి, వారి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) సొమ్ము రూ. 30 లక్షలను ఒక నకిలీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు.
డబ్బులు జమ కాగానే ఆ ముఠా కాల్స్ కట్ చేయడంతో అనుమానం వచ్చిన వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరు నెలల పాటు జరిపిన ముమ్మర దర్యాప్తులో ఆ నగదు హర్యానాకు చెందిన ఒక బోగస్ కంపెనీ ఖాతాకు చేరినట్లు గుర్తించి, ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే, కాజేసిన మొత్తంలో రూ. 12 లక్షలను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలేవీ ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా “డిజిటల్ అరెస్ట్” చేయవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply