నేపాల్లో సంభవించిన భయంకర వరదల్లో గల్లంతైన వారి మృతదేహాలు లభించకపోవడంతో.. వారి కుటుంబ సభ్యులు దిష్టిబొమ్మలను తయారు చేసి వాటితో అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన చోటుచేసుకుంది.
గత నెల 26వ తేదీన టిబెట్ ప్రాంతంలో సంభవించిన కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత బోటేకోషి నదిలో ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి. దీంతో నేపాల్లోని ఉత్తర, మధ్య జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
బండరాళ్లు, మట్టి, బురదను తన వెంట తీసుకెళ్లిన వరద ఉధృతికి స్థానికులతో పాటు పర్యాటకులు కూడా చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది పరుగులు తీసినప్పటికీ.. వేగంగా దూసుకొచ్చిన వరదలో అనేక మంది కొట్టుకుపోయారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కొంతమందిని రక్షించినప్పటికీ.. మరికొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు.
ఈ విపత్తులో ఇప్పటివరకు 1,127 మంది మృతి చెందినట్లు, దాదాపు 12 వేల మందిని రక్షించినట్లు సమాచారం. మరో 4 వేల మంది వరకు గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదలు సంభవించి ఇప్పటికే చాలా రోజులు గడిచిపోవడంతో.. గల్లంతైన వారిలో చాలామంది మృతి చెంది ఉండవచ్చనే ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో ఖాట్మాండులోని పశుపతినాథ ఆలయ ప్రాంగణంలో మృతదేహాలు లభించని వారి కోసం ప్రత్యేకంగా అంత్యక్రియలు నిర్వహించారు.
మృతదేహాలకు బదులుగా గడ్డితో తయారు చేసిన దిష్టిబొమ్మలను పాడెలపై ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
తమ ఆత్మీయుల ముఖాలను చివరిసారిగా చూసే అవకాశం కూడా లేకపోవడం.. కనీసం మృతదేహాలను కూడా చూడలేకపోవడంతో.. వారి స్థానంలో దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి రావడం అక్కడున్న వారిని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Leave a Reply