కేరళ రాష్ట్రం, మలప్పురం జిల్లా వండూర్ ప్రాంతంలో మధ్యాహ్న భోజనంలో మాంసం కూర లేదనే చిన్న కారణంతో జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన భర్త, తన 38 ఏళ్ల భార్యను కత్తితో పొడిచి చంపిన దారుణం చోటుచేసుకుంది.
ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
మలప్పురం జిల్లా కప్పిల్ ప్రాంతానికి చెందిన ఫాసీలా (38). ఆమె భర్త కున్నుమ్మల్ రషీద్ (48). గత సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రషీద్ పీకలదాకా మద్యం తాగి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న భార్యతో మధ్యాహ్న భోజనానికి మాంసం కూర ఎందుకు వండలేదని వాగ్వాదానికి దిగాడు.
కొద్దిసేపటికే ఈ గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన రషీద్ తన వద్ద ఉన్న కత్తితో ఫాసీలా ఛాతీపై విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కుప్పకూలిన ఆమెను ఇరుగుపొరుగు వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం దక్కక ఫాసీలా ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హత్యకు పాల్పడిన రషీద్ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రషీద్ తరచూ మద్యం సేవించి భార్యను వేధించేవాడని, ఈ మందు వ్యసనం వల్లే వీరి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవని చుట్టుపక్కల వారు తెలిపారు.
ఇలాంటి దిగ్భ్రాంతికరమైన ఘటనే కొద్ది రోజుల క్రితం బీహార్లో కూడా జరగడం గమనార్హం. ఆగస్టు 30న భోజన విషయంలో తలెత్తిన వివాదంలో హేమంత్ భూమిజా అనే వ్యక్తి తన 25 ఏళ్ల భార్య సబితా భూమిజాను కర్రతో (చెక్క దుంగతో) కొట్టి చంపిన విషయం తెలిసిందే.

Leave a Reply