కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లా చాముండికున్ను గ్రామానికి చెందిన కృష్ణన్ కుమారుడు సనూప్ (25). ఇతనికి తల్లి జానకి, సోదరులు శరత్ మరియు శ్యామ్ ఉన్నారు.
సనూప్ రాణిపురంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో ఉన్న ఓ అడ్వెంచర్ పార్కులో జిప్లైన్ (ZipLine) ఆపరేటర్గా విధుల్లో చేరాడు. అయితే ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే ఊహించని రీతిలో జరిగిన ప్రమాదంలో అతడు జిప్లైన్ పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు.
ఈ ప్రమాదానికి సంబంధించి వెలువడిన ప్రాథమిక వివరాల ప్రకారం.. సనూప్ ఓ మహిళా పర్యాటకురాలితో కలిసి జిప్లైన్లో వెళ్తున్న సమయంలో, అతడు తనకు అవసరమైన భద్రతా రోపును (సేఫ్టీ హార్నెస్) సరిగ్గా ధరించలేదని తెలుస్తోంది. ప్రయాణం మధ్యలో తీవ్ర భయానికి గురైన ఆ మహిళ ఒక్కసారిగా సనూప్ చొక్కాను గట్టిగా పట్టుకుని లాగడంతో, అతడు నియంత్రణ కోల్పోయి పైనుంచి కింద పడిపోయాడు. విధుల్లో చేరిన మరుసటి రోజే యువకుడు దుర్మరణం పాలైన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు, అడ్వెంచర్ పార్కుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

Leave a Reply