ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో మానవత్వాన్ని, వైద్య రంగాన్ని నివ్వెరపరిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్లడ్ క్యాన్సర్కు చికిత్స పొందుతున్న మూడేళ్ల అమాయక చిన్నారి, నర్సుల ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ నివ్వెరపరిచే ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
రోగికి ఇవ్వాల్సిన మందుకు బదులుగా ఒక అత్యంత ప్రమాదకరమైన రసాయన ద్రవాన్ని ఆ బాలుడి శరీరంలోకి ఎక్కించడమే ఆ పసిప్రాణం బలి కావడానికి కారణమైంది. మన దేశంలో ఎంతో మంది వైద్యులు, సిబ్బంది 24 గంటలూ ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. అయినప్పటికీ, కొందరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. గత ఏడాది చివర్లో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన అధికారిక విచారణ నివేదిక ఇప్పుడు వెలుపలికి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన సార్థక్ యాదవ్ అనే మూడేళ్ల బాలుడు ‘ల్యుకేమియా’ (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్నాడు. దీంతో ఆ చిన్నారిని 2025 డిసెంబర్ 15న భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ (పిల్లల) వార్డులో చేర్చారు. డిసెంబర్ 17 ఉదయం, బాలుడికి మందులు ఎక్కించే ఐవీ ట్యూబ్లో (IV Line) చిన్న అడ్డంకి (Block) ఏర్పడింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న మధుబాల శర్మ అనే నర్సు, ఆ అడ్డంకిని తొలగించడానికి ఒక ఇంజెక్షన్ను ఐవీ లైన్ ద్వారా ఎక్కించింది. ఆ సిరంజిపై ‘F’ అనే అక్షరం రాసి ఉంది.
ఆ సిరంజిలో ఉన్నది రోజూ ఇచ్చే సాధారణ మందు కాదని అనుమానించిన బాలుడి తండ్రి.. నర్సును ముందే హెచ్చరించాడు. కానీ, నర్సు మధుబాల శర్మ ఆ హెచ్చరికను అస్సలు పట్టించుకోలేదు సరేకదా, పైగా నోరు మూసుకుని ప్రశాంతంగా ఉండాలంటూ బాలుడి తండ్రిని గద్దించింది. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఆ చిన్నారి పరిస్థితి విషమించింది. బాలుడు స్పృహ తప్పిపోవడంతో వెంటనే అత్యవసర చికిత్స విభాగానికి (ICU) తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో చిన్నారి సార్థక్ కన్నుమూశాడు.
నివేదికలో తేలిన షాకింగ్ నిజాలు:
ఈ ఘటనపై ఆసుపత్రి యంత్రాంగం జరిపిన అంతర్గత విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చిన్నారికి ఇచ్చిన ఇంజెక్షన్లో ఉన్నది ‘ఫార్మలిన్’ (Formalin) అనే అత్యంత విషపూరితమైన కెమికల్ ద్రవమని తేలింది. ఫార్మలిన్ అనేది ఫార్మాల్డిహైడ్ గ్యాస్ యొక్క ద్రవ రూపం. ఇది మనుషుల శరీరంలోకి ఎక్కించే మందు కాదు. శస్త్రచికిత్సల (Surgeries) సమయంలో తీసే శరీర కణజాలాలు కుళ్ళిపోకుండా ఉండటానికి, అనాటమీ ల్యాబ్లలో అవయవాలను భద్రపరచడానికి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. ఇది తీవ్రమైన విషపూరిత రసాయనం. దీనిని నేరుగా రక్తనాళాల్లోకి ఎెక్కిస్తే మరణం సంభవించడం ఖాయం.
తప్పు ఎవరిది?
ఆసుపత్రి విచారణలో ఇద్దరు నర్సుల వైపు నుండి ప్రధాన తప్పులు జరిగినట్లు తేలింది. మొదటిగా, అనుగా గుజరాతీ అనే మరో నర్సు ల్యాబ్ అవసరాల కోసం ఒక సిరంజిలో ఫార్మలిన్ ద్రవాన్ని నింపింది. అయితే, దానిని నిబంధనల ప్రకారం సురక్షితమైన ప్రదేశంలో ఉంచకుండా, రోగి పడుకున్న బెడ్ సమీపంలోనే వదిలేసి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత వచ్చిన నర్సు మధుబాల శర్మ, ఆ సిరంజిలో ఏముందో కనీసం తనిఖీ చేయకుండా, దానిపై “F” అని రాసి ఉండటాన్ని చూసి, అది ఫ్లష్ (Flush) చేయడానికి వాడే మందు అనుకుని చిన్నారి శరీరంలోకి ఎక్కించేసింది. ఈ ఇద్దరు నర్సుల నిర్లక్ష్యమే బాలుడి మరణానికి ప్రత్యక్ష కారణమని విచారణ నివేదిక స్పష్టం చేసింది.
కేసు నమోదు – నర్సులు పరారీ:
ఘటన జరిగి కొన్ని నెలలు గడిచిన తర్వాత తాజాగా ఆసుపత్రి విచారణ నివేదిక అధికారికంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో, జూన్ 11న భోపాల్ పోలీసులు సదరు ఇద్దరు నర్సులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నర్సు మధుబాల శర్మపై నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణమైనందుకు గాను ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు.
మరో నర్సు అనుగా గుజరాతీపై ప్రమాదకరమైన రసాయనాలను అజాగ్రత్తగా హ్యాండిల్ చేసినందుకు సెక్షన్ 286 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నర్సులు పరారీలో ఉండగా, వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దేశంలోనే అత్యున్నత వైద్య సంస్థ అయిన ఎయిమ్స్ లాంటి చోట ఇంతటి ఘోర భద్రతా లోపం ఎలా జరిగిందనే ప్రశ్నలు ఇప్పుడు వైద్య రంగాన్ని కుదిపేస్తున్నాయి.

Leave a Reply