ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) వేదికపై పాకిస్థాన్ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. జమ్మూ-కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా పాక్ ప్రతినిధి చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది.
భారత్ గట్టి హెచ్చరిక: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. జమ్మూ-కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ యొక్క అంతర్గత విషయమని, దీనిపై పాకిస్థాన్కు మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. “జమ్మూ-కశ్మీర్ భారత్లో అంతర్భాగం.. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. పాకిస్థాన్ చేసే నిరాధారమైన ఆరోపణలు, రాజకీయ ప్రచారాలు వాస్తవాలను మార్చలేవు” అని ఆయన స్పష్టం చేశారు.
UN వేదిక దుర్వినియోగం: అంతర్జాతీయ వేదికలను, భద్రతా మండలి సభ్యత్వాన్ని పాకిస్థాన్ తన విభజన రాజకీయాల కోసం వాడుకుంటోందని భారత్ ఆరోపించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఐక్యరాజ్యసమితిని పాక్ అపహాస్యం చేస్తోందని, ఇది బాధ్యతారాహిత్యమని హరీష్ విమర్శించారు.
PoKలో ఎన్నికల పై భారత్ అభ్యంతరం: పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని గిల్గిత్-బాల్టిస్థాన్లో జూన్ 7, 2026న పాకిస్థాన్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తుండటాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత భూభాగంలో ఎన్నికలు నిర్వహించే హక్కు పాకిస్థాన్కు లేదని, అక్కడ పాక్ బలవంతంగా, అక్రమంగా పాగా వేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.
భద్రతా మండలిలో సంస్కరణలు: ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు రావాలని భారత్ డిమాండ్ చేసింది. భద్రతా మండలిని మరింత సమర్థవంతంగా, ప్రాతినిధ్యం కలిగినదిగా మార్చడానికి సభ్య దేశాల సంఖ్యను పెంచాలని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.
