బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్కు చెందిన ముంబై బాంద్రాలోని ‘మన్నత్’ విలాసవంతమైన బంగ్లా ప్రాంగణంలోకి రెండు పాములు చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రోజూ వేలాది మంది అభిమానులు గుమిగూడే ఈ భారీ నివాసంలోని లాన్ (పచ్చిక బయలు) ప్రాంతంలో రాత్రి సమయంలో పాముల సంచారాన్ని గుర్తించిన సిబ్బంది, వెంటనే రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. ముంబైలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాముల ఆవాసాలు నీట మునగడంతో, అవి పొడి ప్రదేశాల కోసం జనావాసాల్లోకి చొరబడి ఉండవచ్చని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ గుర్తింపు పొందిన స్నేక్ క్యాచర్ విక్కీ దూబే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న ఒక నిచ్చెన కింద నక్కి ఉన్న సుమారు 8 అడుగుల పొడవైన భారీ పామును ఆయన ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు.
ఆ పాము ‘జెర్రిపోతు’ (Rat Snake / ధామిన్) రకానికి చెందినదని, ఇది మనుషులకు ఎలాంటి హాని కలిగించని పూర్తి విషరహిత పామని తేలడంతో భద్రతా సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పట్టుబడిన పామును అటవీశాఖ మార్గదర్శకాల ప్రకారం సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
అయితే, అదే ప్రాంగణంలో కనిపించిన మరో పాము మనుషుల అలికిడి చూసి తప్పించుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకు గాలించినప్పటికీ ఆ రెండో పాము జాడ దొరకలేదు. దీంతో మన్నత్ నివాసంలోని సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రాంగణంలో గట్టి నిఘా కొనసాగిస్తున్నారు.
విషం లేని పామే అయినప్పటికీ.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే షారూఖ్ ఖాన్ ‘మన్నత్’ నివాసంలోకి పాములు ప్రవేశించిన వార్త బాలీవుడ్ వర్గాల్లో, అభిమానులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
