బీదర్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న నెపంతో కట్టుకున్న భార్యను ఇనుప కడ్డీతో కొట్టి చంపిన ఆర్మీ జవాన్ ఉదంతం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో కలకలం రేపింది.
ఏం జరిగింది? బీదర్ జిల్లా పాల్కీ తాలూకాకు చెందిన జ్ఞానేశ్వర్ (30) ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం సంజన (26)తో అతనికి వివాహమైంది. వివాహం తర్వాత వీరు శివనగర్లో నివాసముంటున్నారు. అయితే, అదే ప్రాంతానికి చెందిన మరో యువతితో జ్ఞానేశ్వర్కు అక్రమ సంబంధం ఏర్పడింది. జ్ఞానేశ్వర్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెను కలుస్తుండేవాడు. ఈ విషయం భార్య సంజనకు తెలియడంతో, ఆమె తన భర్తను పలుమార్లు నిలదీసింది. ఆ సంబంధాన్ని వదిలేయాలని భర్తను హెచ్చరించింది.
అడవిలో దారుణం: ఈ గొడవలు ముదిరిపోవడంతో, భార్యను అడ్డు తొలగించుకోవాలని జ్ఞానేశ్వర్ ప్లాన్ వేశాడు. సంజనను మంచి మాటలతో నమ్మించి, కారులో బయటకు తీసుకెళ్లాడు. అడవి ప్రాంతంలో ఉన్న ఒక గుడికి వెళ్దామని చెప్పి, అక్కడికి చేరుకున్నాక జనసంచారం లేని అడవిలోకి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ముందుగా సిద్ధం చేసుకున్న ఇనుప కడ్డీతో సంజన తల, మెడపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమె చనిపోయిందని భావించిన జ్ఞానేశ్వర్ అక్కడి నుండి పరారయ్యాడు.
చికిత్స పొందుతూ మృతి: తీవ్రంగా గాయపడి అడవిలో పడి ఉన్న సంజనను స్థానికులు గమనించి, బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమె కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న జవాన్ జ్ఞానేశ్వర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు.
