మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో సెల్ఫోన్ కొనివ్వాలనే వివాదం కారణంగా 19 ఏళ్ల యువకుడు, అతని తల్లిదండ్రులు కొండపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఛత్రపతి శంభాజీనగర్ ప్రాంతానికి చెందిన గుణాల్ చంద్గుడే (19) అనే యువకుడు తనకు ‘ఐఫోన్’ కొనివ్వాలని ఇంట్లో పట్టుబట్టాడు. దానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గుణాల్, సమీపంలోని కొండపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానిక ప్రజలు అక్కడికి చేరుకుని అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
తల్లిదండ్రులు అతడిని బతిమాలి శాంతింపజేసేందుకు యత్నిస్తుండగా, గుణాల్ ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు దూకేశాడు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన తండ్రి మురళీధర్ (48) పట్టుతప్పి లోయలో పడిపోయారు. కళ్లెదుటే భర్త, కొడుకు పడిపోవడం చూసి తట్టుకోలేకపోయిన తల్లి సంగీత కూడా వెంటనే కొండపై నుంచి కిందికి దూకేసింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ హృదయ విదారక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply