మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో 17 ఏళ్ల మైనర్ బాలిక గొంతునులిమి హత్య చేసిన కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు.
అవధ్పురాకు చెందిన ఆ బాలిక నయా బజార్లోని ఓ చీరల దుకాణంలో పనిచేసేది. ఇషాన్ ఖాన్ అనే యువకుడితో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె, ఇషాన్ వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం గమనించి ఇటీవల అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ బాలికకు కుటుంబ సభ్యులు వేరే సంబంధం కుదర్చడంతో కక్ష పెంచుకున్న ఇషాన్, తన బంధువు అర్బాజ్ ఖాన్తో కలిసి ఆమెను అంతమొందించేందుకు పథకం వేశాడు.
ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలికను కేఆర్జీ కళాశాల సమీపంలో బాలెనో కారులో అపహరించారు. అనంతరం క్యాన్సర్ హిల్స్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలని ఇషాన్ ఒత్తిడి చేశాడు. అందుకు ఆ బాలిక ఖరాఖండిగా తిరస్కరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో ఇషాన్ చెప్పడంతో అర్బాజ్ బాలిక చేతులను గట్టిగా పట్టుకోగా, ఇషాన్ ఆమె చున్నీతోనే మెడకు ఉరివేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
బాలిక అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి ఇషాన్ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించడంతో హత్యకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పెళ్లికి నిరాకరించడమే ఈ దారుణ హత్యకు ప్రధాన కారణమని సీఎస్పీ ధరంవీర్ సింగ్ వెల్లడించగా, నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply