ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్లోని ఒక పోలీస్ స్టేషన్లో గత శుక్రవారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద కలకలం రేగింది.
పోలీసు అధికారులు తన ఫిర్యాదును వినడానికి నిరాకరించారనే కోపంతో ఒక యువకుడు, మత్తు తలకెెక్కిన స్థితిలో పోలీస్ స్టేషన్లోకి చొరబడి అర్ధరాత్రి వేళ పెద్ద రగడ సృష్టించాడు.
పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన ఆ యువకుడు, అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కుర్చీలో చొక్కా లేకుండా అర్ధనగ్నంగా కూర్చున్నాడు. అంతేకాకుండా, టేబుల్పై ఉన్న పోలీస్ క్యాప్ (టోపీ) ని తీసి తన తలపై పెట్టుకుని, అక్కడి టేబుల్ను కోపంగా బాదుతూ తానే ఒక పోలీస్ అధికారిలా నటించాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం రేపుతున్నాయి.
అంతటితో ఆగకుండా, ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుని టేబుల్పై ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఫైళ్లపై తన ఇష్టానుసారంగా సంతకాలు చేశాడు. “ఇకపై అన్ని నిర్ణయాలు ఇక్కడే తీసుకోబడతాయి” అని గట్టిగా అరుస్తూ, కొన్ని ముఖ్యమైన పత్రాలను చింపి అవతల పారేశాడు. ఆ తర్వాత, పోలీస్ స్టేషన్ తలుపుల అద్దాలను పగలగొట్టి, అక్కడ ఉన్న పూలకుండీలు, కుర్చీలు మరియు ప్రధాన ద్వారంతో సహా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాడు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు, తీవ్రంగా శ్రమించి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ అద్దాలు పగలగొట్టే సమయంలో ఆ యువకుడి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో, అతడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అతను తీవ్రమైన మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సహా పలు కఠినమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు ముమ్మర విచారణ జరుపుతున్నారు.
