కాఠ్మాండూ: నేపాల్లో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా మారి కేవలం 18 ఏళ్లు మాత్రమే అవుతోంది. అంతకుముందు 240 ఏళ్లపాటు అక్కడ రాచరికమే కొనసాగింది. ఎంతో పటిష్టంగా ఉన్న నేపాల్ రాచరికం కేవలం 15 నిమిషాల్లో ఎలా అంతమైపోయింది? ఆ ఘటన వెనుక ఉన్న నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
2001, జూన్ 1వ తేదీన నేపాల్లోని నారాయణహితి రాజభవనంలో షా వంశీయులు రాత్రి విందు కోసం సమావేశమయ్యారు. బయట కాఠ్మాండూ నగరం నెమ్మదిగా నిద్రపోతోంది. రాత్రి సుమారు 9 గంటల సమయంలో, ఒక సాధారణ కుటుంబ కలయిక కాస్తా.. కేవలం 15 నిమిషాల్లో రాజు మరియు వారసుల సామూహిక హత్యలతో తీరని విషాదంగా మారింది.
ఆ రాత్రి విందు
ఆ విందులో, 1990లో నేపాల్ను రాజ్యాంగబద్ధ రాచరికంగా మార్చిన రాజు వీరేంద్ర, రాణి ఐశ్వర్య మరియు యువరాజు దీపేంద్ర పాల్గొన్నారు. యువరాజు దీపేంద్ర అప్పటికే అమితంగా మద్యం సేవించి ఉన్నారు. దేవియాని రాణాను వివాహం చేసుకోవాలనే తన కోరికను రాజకుటుంబం వ్యతిరేకించడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీపేంద్ర పెళ్లాడాలనుకున్న దేవియాని రాణా, నేపాల్ రాజకీయ నాయకుడు పశుపతి శంషేర్ జంగ్ బహదూర్ రాణా మరియు ఉషా రాజే సింధియా కుమార్తె. ఆమెకు భారతదేశంలోని గ్వాలియర్ మాజీ రాజకుటుంబం (మాధవరావు సింధియా, వసుంధర రాజే సింధియా) తో కూడా బంధుత్వం ఉంది.
కాల్పుల కలకలం
సమయం గడిచేకొద్దీ దీపేంద్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాత్రి 9 గంటలకు ముందు ఆయన పరిస్థితి విషమించడంతో, ప్యాలెస్ సిబ్బంది ఆయనను బిలియర్డ్స్ గది నుండి తన సొంత గదికి తీసుకెళ్లారు. ఆయన వెళ్ళిన తర్వాత విందు కొనసాగింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత దీపేంద్ర సైనిక దుస్తులు ధరించి, ఆటోమేటిక్ తుపాకులతో భోజనశాలలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఆ సమయంలో జరిగిన భయానక దృశ్యం గురించి రాజు సోదరుడు రవి శంషేర్ రాణా ‘టైమ్’ పత్రికతో మాట్లాడుతూ.. “దీపేంద్ర తన తండ్రిని చూశాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్షణాల్లో ట్రిగ్గర్ నొక్కేశాడు” అని చెప్పారు.
తుడిచిపెట్టుకుపోయిన రాజకుటుంబం
మొదట రాజు వీరేంద్రపై కాల్పులు జరిగాయి. అడ్డుకోబోయిన వారిపై, తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిసింది. ప్యాలెస్ హాల్ అంతా తుపాకుల శబ్దాలతో, గాజు పెంకుల విచ్ఛిన్నంతో మారుమోగింది. తన భర్తను కాపాడుకోవడానికి వెళ్లిన రాణి ఐశ్వర్య, యువరాజు నిరంజన్, యువరాణి శృతి సహా పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హాల్లో కాల్పులు జరిపిన అనంతరం, గార్డెన్లో కూడా దీపేంద్ర కాల్పులు జరిపి చివరకు తనను తాను కాల్చుకున్నాడు.
తీవ్ర గాయాలతో ఉన్న వారిని సైనిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నేపాల్ రాజకుటుంబం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. కోమాలో ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం కాల్పులు జరిపిన దీపేంద్రనే రాజుగా ప్రకటించారు. అలా నేపాల్ మూడు రోజుల పాటు కోమాలో ఉన్న రాజును కలిగి ఉంది. జూన్ 4, 2001న ఆయన కన్నుమూశారు.
రాచరికానికి ముగింపు
ఆ తర్వాత రాజు వీరేంద్ర తమ్ముడు జ్ఞానేంద్ర సింహాసనాన్ని అధిష్టించారు (ఆయన ఆ రాత్రి విందులో లేరు). ఆ సమయంలో నేపాల్ మావోయిస్టుల తిరుగుబాటు మరియు రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సామూహిక హత్యల ఘటనతో ప్రజల్లో రాచరికంపై నమ్మకం పూర్తిగా పోయింది.
2005లో రాజు జ్ఞానేంద్ర ప్రత్యక్ష పాలనను చేపట్టినప్పుడు ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు 2008లో, 240 ఏళ్ల రాచరికానికి స్వస్తి పలుకుతూ నేపాల్ పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేసింది.

Leave a Reply