న్యూఢిల్లీ: ఒక తండ్రి తన ఆస్తికి సంబంధించి ఎలాంటి విల్ (ఉయిల్నామా) రాయకుండానే మరణిస్తే.. ఆ ఆస్తిపై వివాహమైన కుమార్తెకు హక్కు ఉంటుందా? ఈ విషయంలో భారతీయ చట్టం ఏం చెబుతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
భారతదేశంలో తల్లిదండ్రులు తాము సంపాదించిన ఆస్తి తమ తర్వాత తమ పిల్లలకే చెందాలని ఆశిస్తుంటారు. అందుకోసం ఏ ఆస్తిని, ఎవరికి, ఎంత వాటా ఇవ్వాలో స్పష్టంగా విల్ రాసి పెడుతుంటారు. వారు మరణించిన తర్వాత ఆ విల్ ప్రకారమే వారసులకు ఆస్తుల పంపిణీ జరుగుతుంది. విల్ రాయడం వల్ల భవిష్యత్తులో ఆస్తి తగాదాలు, కోర్టు కేసుల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే, కొందరు ఎలాంటి విల్ రాయకుండానే అకస్మాత్తుగా మరణిస్తుంటారు. అలాంటప్పుడు సదరు వ్యక్తి ఆస్తి ఎవరికి చెందుతుంది? కొడుకు, కూతురు ఆ ఆస్తిని ఎలా పంచుకోవాలి? దానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
కుమార్తెలకు సమాన హక్కు:
ఒక తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిలో.. కుమార్తెకు వివాహం అయినా, కాకపోయినా కొడుకుతో సమానమైన హక్కు ఉంటుంది. ‘హిందూ వారసత్వ చట్టం 2005’ (Hindu Succession Act 2005) ప్రకారం.. తండ్రి ఆస్తిలో కుమారుడికి ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉంటాయో, కుమార్తెకు కూడా సరిగ్గా అలాంటి హక్కులే ఉంటాయి. తండ్రి విల్ రాయకుండా మరణించిన పక్షంలో, ఆయన ప్రత్యక్ష చట్టబద్ధమైన వారసులందరికీ (Class-1 Heirs) ఆస్తిపై సమాన హక్కు ఉంటుంది.
అయితే, ఒకవేళ తండ్రి తాను బతికున్న కాలంలోనే తన స్వయార్జిత ఆస్తిని వేరే ఎవరికైనా విల్ ద్వారా రాసిపెట్టి ఉంటే.. అప్పుడు కుమార్తె అందులో వాటా కోరడానికి వీల్లేదు. అదే సమయంలో, అది స్వయార్జిత ఆస్తి కాకుండా పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి (Ancestral Property) అయితే మాత్రం.. అందులో వారసులందరికీ పుట్టుకతోనే సమాన హక్కు లభిస్తుంది.
విడాకులు తీసుకున్న మహిళ పిల్లల హక్కులు:
విడాకులు తీసుకున్న ఒక మహిళకు, తన మాజీ భర్త పూర్వీకుల ఆస్తిలో తన కుమారుడికి/పిల్లలకు వాటా దక్కుతుందా అనే అనుమానాలు కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంటాయి. వారసత్వ చట్టం ప్రకారం.. పూర్వీకుల ఆస్తిలో ప్రత్యక్ష వారసులకు ఎప్పుడూ హక్కు ఉంటుంది. ఇందులో దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ, లేదా ఆ మాజీ భర్త మరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె ద్వారా పిల్లలను కన్నప్పటికీ.. విడాకులు తీసుకున్న మొదటి భార్య కొడుకుకు/పిల్లలకు కూడా తండ్రి తరఫు పూర్వీకుల ఆస్తిపై చట్టపరమైన హక్కు ఉంటుందని గుర్తుంచుకోవాలి.
విల్ రాయడం ఎందుకు ముఖ్యం?
కష్టపడి ఆస్తులు సంపాదించే తండ్రి, తన కాలం తర్వాత పిల్లల మధ్య ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి తన జీవితకాలంలోనే విల్ రాసి పెట్టడం అత్యుత్తమమైన మార్గం. బతికుండగానే ఎవరికి ఎంత ఆస్తి చెందాలో స్పష్టంగా పేర్కొనడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
ఉదాహరణకు.. ఒక తండ్రి స్వయంగా సంపాదించిన రెండు ఇళ్లు ఉన్నాయనుకుందాం. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉంటే, ఆ ఇళ్లను చెరొకటి రాసి ఇవ్వవచ్చు. కానీ ఆయన కేవలం ఒకే ఇంట్లో నివసిస్తుంటే.. తాను బతికున్నంత కాలం ఆ ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కు తనకే ఉండేలా, తన తర్వాతే ఆ ఇల్లు పిల్లలకు చెందేలా విల్లో స్పష్టమైన నిబంధనలను రాసి ఉంచవచ్చు.

Leave a Reply