మహారాష్ట్ర రాష్ట్రంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల పాదభాగంలో ఉన్న ఒక అందమైన గ్రామమే ‘ఫోప్సాండి’ (Fophsandi).
నలువైపులా ఎత్తైన పర్వతాలు, లోయలతో చుట్టుముట్టబడిన ఈ గ్రామంలో.. రోజులో పగటి సమయం కేవలం 6 నుంచి 7 గంటలు మాత్రమే ఉండటం అత్యంత విచిత్రమైన విశేషం.
చుట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతాలు సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల, ఇక్కడ సూర్యోదయం చాలా ఆలస్యంగా జరగడమే కాకుండా.. సూర్యాస్తమయం కూడా సాధారణ సమయం కంటే చాలా ముందే జరిగిపోతుంది. దీని కారణంగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామ ప్రజలకు సూర్యకాంతి అతి తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది.
ఈ గ్రామం పేరు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. బ్రిటిష్ పాలన కాలంలో ‘ఫోప్’ (Foph) అనే ఆంగ్లేయ అధికారి ఆదివారాల్లో విశ్రాంతి తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లేవారట. ఆయన పేరు మీదుగానే ఈ గ్రామానికి ‘ఫోప్సాండి’ అనే పేరు వచ్చిందని చెబుతారు. దీనికి నిదర్శనంగా ఆ అధికారి బస చేసిన అతిథి గృహ అవశేషాలు నేటికీ అక్కడ కనిపిస్తాయి.
అంతేకాకుండా, ప్రసిద్ధ మాండోవి నది (Mandovi River) ఈ గ్రామ సరిహద్దు ప్రాంతం నుంచే ఉద్భవిస్తుంది. పురాతన కాలంలో ‘మాండవ్య’ అనే ముని ఇక్కడి గుహలో తపస్సు చేశారని, ఆయన జ్ఞాపకార్థమే ఈ నదికి మాండోవి నది అనే పేరు వచ్చిందని స్థానిక ప్రజలు విశ్వసిస్తారు.
ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే కొండలు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఫోప్సాండి గ్రామం.. తనదైన ప్రత్యేకమైన స్వల్ప పగటి సమయంతో పర్యాటకులను, పరిశోధకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

Leave a Reply