ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మౌ జిల్లాలోని ఒక ప్రాంతంలో, తన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఒక యువతి 120 అడుగుల ఎత్తైన సెల్ఫోన్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్య బెదిరింపులకు దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రతన్పురా ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన సెల్ఫోన్ టవర్ పైకి ఒక యువతి హఠాత్తుగా వేగంగా ఎక్కింది. మండుతున్న ఎండను కూడా లెక్కచేయకుండా ఆమె ప్రమాదకర స్థితిలో టవర్ పైభాగంలో నిలబడటం చూసిన ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సమాచారం దావానంలా వ్యాపించడంతో వందలాది మంది అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చిన రతన్పురా పోలీసులు గుంపును అదుపు చేసి, ఆ యువతితో చర్చలు జరిపారు. విచారణలో, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసినందుకే ఆగ్రహం చెందిన ఆమె, అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రమాదకర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సుమారు గంటకు పైగా కొనసాగిన ఉత్కంఠభరిత పోరాటం తర్వాత, అధికారులు ఆ యువతికి తెలివిగా నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాతే అక్కడున్న అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అరెస్టయిన ప్రియుడి వివరాలు మరియు ఈ వ్యవహారం వెనుక ఉన్న కారణాలపై రతన్పురా పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply