సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం ఏదైనా చేస్తారనే పరిస్థితి మారి.. ఇప్పుడు నేరుగా ఇన్స్టాగ్రామ్ వేదికగానే కోట్లాది రూపాయలు దోచుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది.
’25/Aug/2026′ పేరుతో ప్రారంభమైన ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా, కేవలం 6 పోస్టులతోనే దాదాపు 4.26 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుని నెట్టింట తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆ పేజీలో, “ఆగస్టు 25న ఒక అద్భుతమైన రహస్యాన్ని బయటపెట్టబోతున్నాం” అంటూ భారీ హైప్ క్రియేట్ చేసి ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని పెంచారు. ఆ సీక్రెట్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో నెటిజన్లు ఆ పేజీని పెద్ద సంఖ్యలో ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత, సదరు ఇన్స్టా పేజీ నిర్వాహకులు ఫాలోవర్లను టెలిగ్రామ్ గ్రూప్కు మళ్లించి.. ఆగస్టు 25 అర్ధరాత్రి ఆ రహస్యం చూడాలంటే ప్రతి ఒక్కరూ ₹502 చొప్పున చెల్లించాలనే నిబంధన విధించారు.
ఆ మిస్టరీని ఎలాగైనా చూడాలనే ఆత్రుతతో దాదాపు 1.66 లక్షల మంది పోటీపడి మరీ ఒక్కొక్కరు ₹502 ఆన్లైన్ ద్వారా చెల్లించారు. దీని ద్వారా ఆ పేజీ నడిపిన వ్యక్తి కేవలం ఒక్క రాత్రిలోనే ఏకంగా ₹8.3 కోట్లను సులువుగా వసూలు చేశాడు. డబ్బులు వసూలైన తర్వాత, ఆగస్టు 25 అర్ధరాత్రి ఆ రహస్యం ఎప్పుడు బయటకు వస్తుందా అని అందరూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు.
అయితే, అర్ధరాత్రి ఆ పేజీలో విడుదల చేసిన వీడియోను చూసి డబ్బులు కట్టిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అందులో ఎలాంటి రహస్యమూ లేదు; దానికి బదులుగా, “జీవితంలో డబ్బు, రహస్యాలు ఏవీ ముఖ్యం కాదు.. సమయం మాత్రమే చాలా ముఖ్యం!” అంటూ సాధారణ AI వాయిస్తో మాట్లాడే ఒక మోటివేషనల్ వీడియోను మాత్రమే పోస్ట్ చేశారు. ₹502 చెల్లించి నిలువునా మోసపోయిన జనం, తమ అమాయకత్వాన్ని తిట్టుకుంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply