మహారాష్ట్రలోని శంభాజీనగర్లో ఐఫోన్ కొనుగోలు మరియు ఈఎంఐ చెల్లింపుల వివాదం ఓ నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. ఆత్మహత్యకు పాల్పడబోయిన కుమారుడిని కాపాడే క్రమంలో తల్లిదండ్రులు కూడా కొండపై నుంచి పడి మృతి చెందిన హృదయ విదారక ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
శంభాజీనగర్లోని గవట్య (Gavatya) కొండపై జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కన్నీటి సంద్రంలో ముంచెత్తింది. జాల్నా జిల్లాకు చెందిన సంకుడే కుటుంబం గత 18 ఏళ్లుగా శంభాజీనగర్లో నివసిస్తోంది. వీరి 16 ఏళ్ల కుమారుడు కునాల్, 10వ తరగతిలో 92 శాతం మార్కులు సాధించి 11వ తరగతిలో చేరాడు. డాక్టర్ కావాలన్నది అతని చిరకాల కోరిక.
అయితే, ఇటీవల కొనుగోలు చేసిన ఐఫోన్ ఈఎంఐ కిస్తులు మరియు ఖర్చుల విషయమై తండ్రి, కొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్.. తన చేతిలో ఉన్న ఐఫోన్, చేతి గడియారం మరియు మెడలోని వెండి గొలుసును నేలకేసి విసిరికొట్టి, ఆవేశంగా గవట్య కొండ శిఖరం వైపు పరుగెత్తాడు. భయాందోళన చెందిన తల్లిదండ్రులు కూడా అతడి వెంటే పరుగుతీశారు.
కొండపై ప్రమాదకరమైన అంచున నిలబడిన కునాల్ను చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ తల్లి వేడుకున్న తీరు గుండెల్ని పిండేసింది. “నీకు మీ నాన్నతోనే కదా గొడవ.. ఇదిగో ఇప్పుడే నా తాళి తీసి పారేస్తాను, మీ నాన్నను వదిలేసి నీతోనే వచ్చేస్తాను, నన్ను విడిచి వెళ్లిపోకు కన్నా!” అని ఆ మాతృమూర్తి కన్నీరుమున్నీరై ప్రాధేయపడింది.
కానీ, తల్లి మాటలను ఏమాత్రం పట్టించుకోని కునాల్.. సుమారు 200 అడుగుల లోతైన లోయలోకి దూకేశాడు. అతడు కిందకు దూకడం చూసి, అతడిని పట్టుకుని కాపాడేందుకు ముందుకు ఉరికిన తండ్రి మురళీధరన్, తల్లి ఇద్దరూ అదుపుతప్పి అదే లోయలో పడిపోయారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకునే యువత ధోరణి ఎంతటి ఘోర విపత్తుకు దారితీస్తుందో చెప్పేందుకు ఈ ఘటన ఒక విషాద సాక్ష్యంగా మిగిలింది.

Leave a Reply