కతిహార్: అనుమానపు బుద్ధితో కన్నతల్లి లాంటి భార్య అని కూడా చూడకుండా, ఆమె వ్యక్తిగత మరియు అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో షేర్ చేసిన నిందితుడు దయానంద్ కుమార్ను బీహార్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలు గత జనవరి 9, 2026 న ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా సైబర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన రోజు నుండి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టిన ప్రత్యేక పోలీసు బృందం.. ఎట్టకేలకు పక్కా సమాచారంతో దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది.
లైకులు, కామెంట్ల కోసం వికృత చేష్టలు:
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు దయానంద్ కుమార్కు బాధితురాలితో 2023లో వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే పెళ్లయిన మొదటి రోజు నుంచే తన భార్యకు వేరే మగవాడితో అక్రమ సంబంధం ఉందంటూ అతను నిరంతరం అనుమానించేవాడు. ఈ విపరీతమైన అనుమానపు బుద్ధి, సంకుచిత మనస్తత్వంతో ఆమెను మానసికంగా వేధించడమే కాకుండా.. భార్యకు సంబంధించిన ప్రైవేట్ కంటెంట్ను ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు.
భార్య వ్యక్తిత్వాన్ని సమాజంలో కించపరచడం, అదే సమయంలో సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, కామెంట్ల ద్వారా ఫాలోవర్లను పెంచుకుని పాపులర్ అవ్వడమే లక్ష్యంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.
నేరాన్ని అంగీకరించిన భర్త:
అరెస్ట్ అనంతరం పోలీసులు తమ శైలిలో విచారించగా, నిందితుడు దయానంద్ తాను చేసిన సైబర్ నేరాన్ని అంగీకరించాడు. అయినప్పటికీ, తన భార్య ప్రవర్తనపై ఉన్న అనుమానమే తనను ఈ పని చేసేలా ప్రేరేపించిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, సాంకేతిక ఆధారాలతో నేరం రుజువైన తర్వాతే నిందితుడిని అరెస్ట్ చేశామని సైబర్ డీఎస్పీ అలీమ్ వెల్లడించారు. ఈ ఘోర అవమానం భరించలేక ప్రస్తుతం ఆ బాధితురాలు తన పుట్టింటికి చేరి తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది.

Leave a Reply