ఛతర్పూర్ వ్యక్తి దారుణం: మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి తన జననాంగాన్ని (ప్రైవేట్ పార్ట్) స్వయంగా కోసుకున్నాడు. తాను చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఇలా చేసినట్లు, కోసిన భాగాన్ని ఒక బావిలో పడేశానని అతను తెలిపాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి చికిత్స అందుతోంది. దీనిపై బాధితుడు రామ్ నారాయణ్ యాదవ్ మాట్లాడుతూ, తన జననాంగాన్ని కోసుకున్నందుకు తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని, భవిష్యత్తులో ఎటువంటి పాపాలు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
గొడ్డలితో దాడి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, అతను గొడ్డలిని ఉపయోగించి తన జననాంగాన్ని కోసుకున్నాడు, ఆపై దానిని ఒక బావిలో పడేశాడు. తన ఆత్మ పవిత్రంగా ఉండాలన్నదే తన ఏకైక కోరిక అని, సంసారిక జీవితం అనే వలలో తాను ఇంకెన్నాళ్లు ఉండాలని అతను ప్రశ్నించాడు. తాను సాధువుగా మారాలనుకుంటున్నారా అని అడగ్గా, అతను అవునని సమాధానమిచ్చాడు. రామ్ నారాయణ్ యాదవ్ భార్య గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని పెద్ద కుమార్తె వివాహం జూన్ 20న జరగాల్సి ఉంది. కుమార్తె పెళ్లికి కొద్ది రోజుల ముందు అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
వైద్యులు ఏమంటున్నారు? ఈ ఘటనపై సర్జన్ మనోజ్ చౌదరి స్పందిస్తూ, “40 ఏళ్ల వ్యక్తి తీవ్ర గాయాలతో మహారాజ్పూర్ నుండి మా వద్దకు వచ్చాడు. తన జననాంగంపై గొడ్డలితో గాయం చేసుకున్నానని రోగి స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. జననాంగంలోని కొంత భాగం తెగిపోవడంతో అధిక రక్తస్రావం జరిగింది. అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం,” అని తెలిపారు.
