మధ్యప్రదేశ్ రాష్ట్రం షియోపూర్ జిల్లా జైలు నుంచి ఓ విచారణ ఖైదీ చాకచక్యంగా తప్పించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
జైలులో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన భగవద్గీత ప్రవచనాల కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మేంద్ర అనే విచారణ ఖైదీ, ఉదయం టైలరింగ్ శిక్షణకు హాజరైన తర్వాత మధ్యాహ్నం జరిగిన గీతా పారాయణం కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు. అయితే కార్యక్రమం ముగిసే సమయానికి అతడు జైలు ప్రాంగణంలో కనిపించకపోవడంతో జైలు సిబ్బంది షాక్కు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. అందరి దృష్టి ప్రవచన కార్యక్రమంపై ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న సదరు ఖైదీ, జైలులో ఉన్న దుప్పట్లను ఒకదానికొకటి తాడులా కట్టి, ఎత్తైన ప్రహరీ గోడను దూకి బయటకు పారిపోయినట్లు తెలిసింది. ఖైదీ అదృశ్యమైన విషయాన్ని గుర్తించిన వెంటనే జైలు అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రతా లోపాలపై జైలు యంత్రాంగం అంతర్గత విచారణ ప్రారంభించింది.
పరారైన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు వెళ్లడానికి అవకాశమున్న ప్రాంతాలపై నిఘా ఉంచడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. అతడు గోడ ఎలా ఎక్కగలిగాడు? భద్రతలో ఎక్కడ లోపం జరిగింది? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో అధికారులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
జైలులో ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుండగానే విచారణ ఖైదీ తప్పించుకుపోవడం జైలు భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ప్రస్తుతం ధర్మేంద్ర కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోందని, అతడు పట్టుబడితేనే ఈ ప్లాన్ వెనుక ఉన్న పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Leave a Reply