మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్ ప్రాంతంలో, ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఆదివారం మధ్యాహ్నం 59 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కన్నడ్ ఘాట్ ఘాట్రోడ్డు మార్గంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో అనుకోకుండా బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన బస్సు అదుపుతప్పి అటూఇటూ దూసుకెళ్లింది.
59 మంది ప్రయాణికులతో వేగంగా వెళ్లిన ఆ బస్సు, క్షణాల వ్యవధిలో కొండపై ఉన్న రక్షణ గోడను (పారాపెట్ వాల్) బలంగా ఢీకొట్టి నిలిచిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. బస్సు సరిగ్గా రక్షణ గోడను ఢీకొని ఆగిపోవడంతో పెను విషాదం తప్పింది. ఒకవేళ ఆ గోడ లేకపోయి ఉంటే, బస్సు వందల అడుగుల లోతైన లోయలోకి పల్టీలు కొట్టి భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది.
ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు కిటికీల గుండా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఘటనపై సంబంధిత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply