న్యూఢిల్లీ నైరుతి ప్రాంతానికి చెందిన ఒక కళాశాల విద్యార్థినికి 2023 డిసెంబర్లో సోషల్ మీడియా ద్వారా ఒక గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు.
అనంతరం ఫోన్ ద్వారా నిరంతరం టచ్లో ఉంటూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ఆ యువతి నగ్న చిత్రాలను సృష్టించాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ బ్లాక్మెయిలింగ్తో విడతల వారీగా ఆమె నుంచి దాదాపు ₹1.2 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరువు పోతుందన్న భయంతో దాదాపు ఏడాదిన్నర పాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పని ఆ విద్యార్థిని.. చివరకు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 2025 జూలైలో ఆమెను నేరుగా కలిసినప్పుడు కూడా ఆ వ్యక్తి ఫొటోలను చూపించి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఆ నిందితుడికి డబ్బులు పంపేందుకు ఆ విద్యార్థిని తన తల్లి బ్యాంక్ ఖాతాను ఉపయోగించింది. ఖాతా నుంచి చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు కట్ అవుతుండటాన్ని గమనించిన తండ్రి.. ఆరా తీయడంతో కూతురు ఎదుర్కొంటున్న ఈ దారుణ పరిస్థితి బయటపడింది. ఇంతలోనే, ఈ నెల ప్రారంభం నుండి ఆ విద్యార్థిని తండ్రి, బాబాయ్ వంటి ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే యువతిపై యాసిడ్ దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిరంతర వేధింపులు, బెదిరింపులతో ఆ విద్యార్థిని కుటుంబం తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది.
బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. నిందితుడిని ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్కు చెందిన అజయ్ దూబేగా గుర్తించి నిఘా పెట్టారు. ఇతనికి గతంలోనూ నేర చరిత్ర ఉందని, 2020లో నంగ్లోయ్ పోలీస్ స్టేషన్లో, 2019లో నిహాల్ విహార్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదైన కొద్ది రోజులకే.. పాత కేసు విచారణ కోసం కోర్టుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన అజయ్ దూబేను పోలీసులు పక్కా వ్యూహంతో అరెస్ట్ చేశారు. ఇతడు ఇదే తరహాలో మరికొందరు మహిళలను లేదా విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిలింగ్, డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply