పళని – కొడైకెనాల్ ఘాట్ రోడ్డు మార్గంలో ఉన్న అయ్యంపుల్లి పోలీస్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. కేరళ రాష్ట్రానికి చెందిన కొందరు పర్యాటకులు కారులో అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సదరు వాహనాన్ని ఆపి సోదాలు చేశారు.
ఆ సోదాల్లో, అనుమతి లేకుండా తరలిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లను పోలీసులు కనుగొని, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ (మురై కావలర్) అళగర్సామి.. ఆ మద్యం బాటిళ్లను తిరిగి పర్యాటకులకు ఇచ్చేయడానికి రూ. 500 లంచం డిమాండ్ చేసి తీసుకున్నాడు. ఈ లంచం డబ్బుల లావాదేవీని అక్కడే ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది.
ఈ వీడియో విజువల్స్ ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా, పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీనిపై దిండిగల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) తీవ్రంగా స్పందిస్తూ తక్షణ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో, హెడ్ కానిస్టేబుల్ అళగర్సామి పర్యాటకుల నుండి లంచం తీసుకున్నట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. దీంతో పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ అళగర్సామిని తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులతో పాటు స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply