ఆఫ్ఘనిస్థాన్: మానవ హక్కులను కాలరాసే నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ పాలన, తాజాగా వివాహ వ్యవస్థపై మరో వివాదాస్పద చట్టాన్ని తెచ్చింది. ఇది కేవలం ఒక మత పెద్ద జారీ చేసిన ఫత్వా మాత్రమే కాదు, తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన కొత్త చట్టం. దీని ద్వారా మతపరమైన కోర్టులకు అనంతమైన అధికారాలను కట్టబెట్టారు.
చట్టంలో ఏముంది?
తాలిబన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించిన ఈ కొత్త కుటుంబ చట్టం ప్రకారం:
- మౌనమే సమ్మతి: ఒక అవివాహిత అమ్మాయి మౌనంగా ఉంటే, అది ఆమె వివాహానికి అంగీకారంగా పరిగణించబడుతుంది. కానీ, అబ్బాయిల విషయంలో లేదా వివాహిత మహిళల విషయంలో ‘మౌనం’ సమ్మతిగా పరిగణించబడదు. ఇది పరోక్షంగా బాల్యవివాహాలకు మరియు బలవంతపు పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తోంది.
- పెద్దల పెత్తనం: తండ్రి లేదా తాతలకు పిల్లల వివాహాలను నిర్ణయించే పూర్తి అధికారం ఉంటుంది.
- వరకట్నం (మెహర్): వరుడు సామాజికంగా సమర్థుడై, నిర్ణీత కట్నం (మెహర్) ఇస్తే, బంధువులు నిర్ణయించిన బాల్యవివాహాలు చెల్లుబాటు అవుతాయి.
మతపరమైన కోర్టుల పెత్తనం
ఈ చట్టం ప్రకారం, టీనేజ్ వయసు రాకముందు చేసిన వివాహాలను, యుక్తవయస్సు వచ్చిన తర్వాత రద్దు చేసుకునే అవకాశం పిల్లలకు ఉంటుంది. కానీ, ఇందుకోసం మతపరమైన కోర్టుల అనుమతి తప్పనిసరి. అలాగే, విడాకులు, కస్టడీ మరియు ఇతర వివాదాస్పద విషయాల్లో నిర్ణయాధికారం పూర్తిగా తాలిబన్ న్యాయమూర్తుల చేతుల్లోనే ఉంటుంది.
ఆంక్షల పర్వం..
2021లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుండి ఆఫ్ఘనిస్థాన్లో మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఆరో తరగతి తర్వాత అమ్మాయిల చదువుపై నిషేధం, విశ్వవిద్యాలయాల్లో మహిళలకు ప్రవేశం లేకపోవడం, ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు మరియు ఒంటరిగా ప్రయాణించడంపై కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజా చట్టం ద్వారా మహిళలను మరింత అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది.
