బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
దాస్పారా ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ స్కూల్ టీచర్తో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం వేసి ఉన్న ఇంటి నుంచి నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను 65 ఏళ్ల గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత, వారి 23 ఏళ్ల కుమార్తె అగామి, 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్గా గుర్తించారు. ఒకే కుటుంబంలో తండ్రి, తల్లి, కుమార్తె, చిన్న కుమారుడు ఇలా నలుగురూ ఒకేసారి అనుమానాస్పద రీతిలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నలుగురి మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యలా లేక ఆత్మహత్యా? కుటుంబానికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? లేక ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా? అనే పలు కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరించాయి.
మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు. మైనర్ బాలుడితో సహా హిందూ కుటుంబం మొత్తం శవాలుగా మారడం బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

Leave a Reply