ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య జరుగుతున్న సైనిక దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మూడు రోజులుగా విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో, దుబాయ్ విమానాశ్రయాలు సోమవారం సాయంత్రం నుండి పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. పేలుళ్ల శబ్దాల మధ్య, సరైన వసతి లేక మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్న వేలాది మంది విదేశీయులకు ఈ ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) మరియు అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DWC) నుండి నేటి సాయంత్రం కొన్ని విమానాలు నడుస్తాయని అధికారులు ధృవీకరించారు.
దుబాయ్ నిర్ణయంతో భారత్కు కొత్త చిక్కులు..!! మూడు రోజుల క్రితం ఇరాన్ నుండి జరిగిన క్షిపణి మరియు డ్రోన్ దాడుల వల్ల ఖతార్, యూఏఈ ప్రాంతాల్లో గగనతలం (Airspace) మూసివేయబడింది. దీనివల్ల ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్వేస్ వంటి ప్రధాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి. భారత్, యూరప్, ఆసియా దేశాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు దుబాయ్, అబుదాబి, దోహా వంటి నగరాల్లో చిక్కుకుపోయారు.
విమానయాన సంస్థల ప్రస్తుత స్థితి:
- ఎమిరేట్స్: సోమవారం రాత్రి నుండి చిక్కుకున్న ప్రయాణికులను దశలవారీగా తరలించనున్నట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక విమానాలు మరియు కార్గో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది.
- ఫ్లై దుబాయ్ (FlyDubai): మార్చి 2, 2026 సాయంత్రం నుండి కొన్ని పరిమిత విమానాలను నడుపుతామని ప్రకటించింది. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు వెబ్సైట్లో తమ బుకింగ్ స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించింది.
- ఎతిహాద్ & ఖతార్ ఎయిర్వేస్: ఎతిహాద్ మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దును పొడిగించింది. ఖతార్ ఎయిర్వేస్ కూడా దోహాకు వచ్చే, వెళ్లే విమానాలను ప్రస్తుతానికి నిలిపివేసింది.
అబుదాబి విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడుల్లో ఒకరు మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం యూఏఈ అధికారులు పరిస్థితులను అదుపులోకి తెచ్చి, ప్రయాణికులకు ఆహారం మరియు వసతి కల్పిస్తున్నారు.
ఈ క్రమంలో దుబాయ్లో చిక్కుకున్న ప్రముఖులు.. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నటుడు అజిత్ కుమార్, క్రీడాకారిణి పి.వి. సింధు, ఈషా గుప్తా, నర్గిస్ ఫక్రీ తదితరులు త్వరగా దేశానికి తిరిగి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply