గురుగ్రామ్లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో వడ్డించిన ఆహారంలో ప్రాణంతో ఉన్న పురుగు పాకుతూ కనిపించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.
గురుగ్రామ్ హారిజాన్ సెంటర్లోని ప్రసిద్ధ ‘పాల్’ (Paul) బేకరీ & కేఫ్కు భోజనం కోసం వెళ్లిన సులభ్ మాథుర్ అనే కస్టమర్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్ అయి వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.
సదరు కస్టమర్ ఉదయం 11 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి ఆ రెస్టారెంట్కు వెళ్లి ఆరుకు పైగా వంటకాలను ఆర్డర్ చేశాడు. అందులో భాగంగా తింటున్న ‘సీజర్ సలాడ్’ (Caesar Salad)లో ప్రాణంతో ఉన్న పురుగు ఒకటి పాకడం చూసి వారంతా షాక్కు గురయ్యారు. వెంటనే ఆ పురుగు దృశ్యాలను వీడియో తీసి, ఇంత ఖరీదైన రెస్టారెంట్లో ఆహార పరిశుభ్రతను గాలికొదిలేయడం అత్యంత విచారకరమని పేర్కొంటూ నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియో 10 లక్షలకు పైగా వీక్షణలు (Views) సాధించి నెటిజన్లలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో, పాల్ రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్కు బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఆహార నాణ్యత, పరిశుభ్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ అనుకోని తప్పుకు చింతిస్తున్నామని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా వివరణ ఇచ్చింది. అయితే, ఇది కేవలం మొక్కుబడి మెసేజ్ మాత్రమేనని, ఈ తీవ్రమైన సమస్యను వారు ఏమాత్రం పట్టించుకోలేదని సులభ్ ఆరోపించారు. భారీగా డబ్బులు వసూలు చేసే ఇలాంటి విలాసవంతమైన రెస్టారెంట్ల నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply