నవంబర్ 13, 2026 నాటికి ప్రపంచం అంతమైపోతుందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
1960లో భౌతిక శాస్త్రవేత్త హైంజ్ వాన్ ఫోర్స్టర్ (Heinz von Foerster) మరియు ఆయన బృందం ప్రచురించిన జనాభా పెరుగుదల గణాంక పరిశోధనను ఆధారంగా చేసుకుని ఈ ప్రచారం మొదలైంది. గత కాలపు ప్రపంచ జనాభా పెరుగుదల డేటా ఆధారంగా వారు ఒక గణిత నమూనాను (Mathematical Model) రూపొందించారు. ఆ సమయంలో ఉన్న జనాభా పెరుగుదల రేటులో ఎలాంటి మార్పు లేకుండా నిరంతరం అలాగే పెరిగితే.. ఒకానొక దశలో జనాభా అపరిమిత స్థాయికి (ఇన్ఫినిటీకి) చేరుకుంటుందని ఆ మోడల్ చూపించింది. ఆ గణిత పరిమితి తేదీగా నవంబర్ 13, 2026 నమోదై ఉండటంతో, ప్రస్తుతం నెటిజన్లు దీనిని “ప్రపంచ వినాశన దినం” (డూమ్స్డే)గా పేర్కొంటూ ప్రచారం చేస్తున్నారు.
అయితే, ఆ తేదీన నిజంగానే ప్రపంచం నాశనమవుతుందని శాస్త్రవేత్తలు చెప్పినట్లు కాదు. జనాభా అదే వేగంతో పెరుగుతూ పోతే సంభవించే ఒక సిద్ధాంతపరమైన గణిత పరాకాష్టను వివరించడానికి మాత్రమే ఆ మోడల్ రూపొందించబడింది. ఆచరణలో జనాభా అపరిమితంగా పెరగడం అసాధ్యం కాబట్టి, ఆ సమీకరణం ఒక నిర్దిష్ట సమయం తర్వాత పనిచేయదని చెప్పడమే దాని ముఖ్య ఉద్దేశం. ఆహార కొరత, సహజ వనరుల క్షీణత, పర్యావరణ మార్పులు, జనాభా సాంద్రత వల్ల వచ్చే సవాళ్లను ముందస్తుగా హెచ్చరించే పరిశోధనగానే దీనిని పరిగణించాలి. కాబట్టి నవంబర్ 13న భూమిపై ఏదో ఒక మహా ప్రళయం సంభవిస్తుందని ఆ పరిశోధన చెప్పలేదు.
పైగా, ఆ పాత గణిత నమూనాను రూపొందించిన కాలం తర్వాత ప్రపంచ జనాభా పెరుగుదల తీరులో గణనీయమైన మార్పులు వచ్చాయి. చాలా దేశాల్లో జననాల రేటు వేగంగా తగ్గుతుండటంతో పాటు, వృద్ధుల జనాభా శాతం పెరుగుతోంది. దీంతో 1960 నాటి డేటాతో తయారుచేసిన ఆ పాత ఫార్ములా నేటి వాస్తవ ప్రపంచ పరిస్థితులకు ఏమాత్రం సరిపోదని ఆధునిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. జనాభా ఎల్లప్పుడూ అదే వేగంతో పెరుగుతూ పోతుందన్న ఆనాటి ప్రాథమిక ఊహే తప్పని కాలక్రమంలో రుజువైంది. అందువల్ల 2026లో ప్రపంచం అంతమవుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
కాబట్టి నవంబర్ 13, 2026న యుగాంతం వస్తుందన్న వార్తలను శాస్త్రీయ నిజాలుగా నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దశాబ్దాల క్రితం రూపొందించిన ఒక గణిత సమీకరణ ఫలితాన్ని, సోషల్ మీడియాలో సంచలన శీర్షికలతో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. సహజ వనరుల పరిమితులను దృష్టిలో ఉంచుకోవాలని ఆనాడు చేసిన హెచ్చరికను అర్థం చేసుకోకుండా.. తప్పుడు కథనాలతో భయాందోళనలు సృష్టిస్తున్నారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Leave a Reply