ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుమిత్ర (19) అనే యువతి, రుతుక్రమం (నెలసరి) సమయంలో గ్రామ సరిహద్దుల్లో స్నానం చేయకూడదనే మూఢాచారం కారణంగా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సుమిత్ర, గ్రామ సంప్రదాయం ప్రకారం స్నానం చేయడానికి తన ఊరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందాకిని నదికి ఒంటరిగా వెళ్లింది. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో కాలుజారి, నది ప్రవాహ ఉధృతికి ఊహించని రీతిలో కొట్టుకుపోయింది. గాలింపు చర్యల అనంతరం శనివారం ఆమె మృతదేహం లభ్యమైంది.
ఆధునిక యుగంలో కూడా మహిళల ప్రాణాలకే ముప్పు తెచ్చే ఇలాంటి ఛాందసవాద మూఢనమ్మకాలను, దురాచారాలను తక్షణమే నిషేధించాలని స్థానికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సంప్రదాయం కూడా మానవ ప్రాణాల కంటే ముఖ్యం కాదని గళమెత్తుతున్నారు.

Leave a Reply