పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు ప్రపంచ వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యంలో, గందరగోళంలో ముంచెత్తారు.
పగటి సమయంలో పూర్తిగా ఆరోగ్యంగా ఉండే ఈ పిల్లలు, పాఠశాలకు వెళ్లడం, ఆడుకోవడం వంటి సాధారణ పిల్లలలాగే ఉంటారు. కానీ సూర్యుడు అస్తమించి సాయంత్రం వేళ కాగానే వీరి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొద్దిసేపట్లోనే వారి శరీరం మొత్తం శక్తిని కోల్పోయి, నడవలేక, మాట్లాడలేక, చేతులు-కాళ్లు కదపలేక నిశ్చలంగా ఉండిపోతారు.
వైద్యులకే సవాలుగా మారిన ఈ విచిత్ర వ్యాధితో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ వైద్యులు వీరిని పరీక్షించారు. పగటిపూట బాగుండి, రాత్రి వేళల్లో మాత్రమే శరీరం పనిచేయడం మానేసే ఇలాంటి కేసును తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని వారు తెలిపారు.
పిల్లల తండ్రి, తన పిల్లలకు సూర్యరశ్మి నుంచే శక్తి లభిస్తుందని నమ్మాడు. కానీ వైద్యులు పిల్లలను పగటిపూట కాంతి లేని చీకటి గదిలో ఉంచి పరీక్షించినప్పుడు కూడా వారు సాధారణంగానే వ్యవహరించారు. దీనితో వ్యాధికి, సూర్యకాంతికి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టమైంది. ఇది ఒక అరుదైన జన్యు నరాల రుగ్మత కావచ్చునని అనుమానించినప్పటికీ, రక్తం, గ్రామంలోని మట్టి మరియు గాలి నమూనాలను విదేశీ ల్యాబ్లకు పంపినా అసలు కారణం పూర్తిగా దొరకలేదు.
ఈ కుటుంబం పరిస్థితి మరింత విషాదకరమైనది; తల్లిదండ్రులిద్దరూ దగ్గరి సంబంధీకులు. వీరికి పుట్టిన 6 గురు పిల్లలలో ఇద్దరు చిన్నతనంలోనే మరణించారు. మిగిలిన పిల్లలకు ఈ లక్షణాలు ఏవీ లేవు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించిన ఈ సోదరులను ప్రజలు ‘సోలార్ కిడ్స్’ అని పిలవడం ప్రారంభించారు. సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ, నేటికీ పరిష్కరించలేని వైద్య చిక్కుముడిగా వీరి సోకం కొనసాగుతోంది.

Leave a Reply