గత లోక్సభ ఎన్నికల సమయంలో తన ‘ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి’ (AISMK) పార్టీని బీజేపీలో విలీనం చేసిన ప్రముఖ నటుడు శరత్కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత, జాతీయ స్థాయి పదవులు దక్కకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పార్టీలో వరుసగా తనను పక్కన పెడుతుండటంతో, ఆయన తన తదుపరి రాజకీయ అడుగుపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కే. అన్నామలై ఆహ్వానం మేరకు తన పార్టీని బీజేపీలో విలీనం చేయగా, విరుదునగర్ నియోజకవర్గం నుంచి శరత్కుమార్ భార్య రాధిక పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే, ఎన్నికల అనంతరం రాష్ట్ర నాయకత్వ మార్పులు మరియు ఇటీవల జాతీయ స్థాయిలో ప్రకటించిన బాధ్యుల జాబితాలో శరత్కుమార్ పేరు లేకపోవడం ఆయనకు తీవ్ర నిరాశ కలిగించింది.
పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం దక్కకపోవడంతో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీలో చేరే అంశంపై శరత్కుమార్ బృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నటి రాధిక, విజయ్ల మధ్య ఉన్న చిరకాల సాన్నిహిత్యం ఈ రాజకీయ మార్పునకు దోహదపడవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఒకవేళ టీవీకేతో చర్చలు ఫలించకపోతే, తన పాత పార్టీ అయిన ‘సమతువ మక్కల్ కట్చి’ని మళ్లీ పునరుద్ధరించే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్లు సమాచారం. దీనిపై మరో రెండు నెలల్లో ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ క్రమంలో, తీవ్ర అసంతృప్తితో ఉన్న శరత్కుమార్ను బుజ్జగించి పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు నైనార్ నాగేంద్రన్ సహా సీనియర్ బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో వరుస మలుపులు చూస్తున్న శరత్కుమార్ తీసుకోబోయే ఈ సంచలన నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
