తల్లికి తన బిడ్డ అంటే ప్రాణం. బిడ్డపై ఏ చిన్న ఆపద వచ్చినా, తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. బిడ్డ క్షేమం కోసం ఆ తల్లి చూపే ధైర్యం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఇప్పుడు మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో జరిగిన ఈ ఘటన కళ్ళకు కడుతోంది. ఇక్కడ ఒక తల్లి తన 6 ఏళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి ఒంటరిగానే చిరుతపులితో పోరాడింది.
చిరుతపులి ఎత్తుకెళ్లిన బాలుడు: సిద్ధి జిల్లాలోని కుస్మి బ్లాక్ పరిధిలోని బారిఝరియా గ్రామంలో ఈ సాహసోపేతమైన ఘటన జరిగింది. ఆ గ్రామం చుట్టూ దట్టమైన అడవులు, కొండలు ఉండటంతో అడవి జంతువుల సంచారం సాధారణం. ఆదివారం సాయంత్రం, కిరణ్ బైగా అనే మహిళ తన పిల్లలతో కలిసి ఇంటి బయట చలి కాచుకుంటోంది. అప్పుడే ఒక్కసారిగా వెనుక నుండి వచ్చిన చిరుతపులి, ఆమె 6 ఏళ్ల కుమారుడు రాహుల్ను నోట కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది.
కిలోమీటర్ మేర వెంటాడిన తల్లి: చిరుతపులి బిడ్డను ఎత్తుకెళ్లడం చూడగానే, తల్లి కిరణ్ భయం వీడి దాని వెనుక పరుగెత్తింది. సుమారు ఒక కిలోమీటర్ వరకు చిరుతను వెంబడించింది. చివరకు పొదల్లో చిరుత కనిపించింది. ఆ పులి బిడ్డను తన పంజాలతో పట్టుకుని ఉంది.
చిరుత చెర నుండి బిడ్డను ఎలా రక్షించింది? బిడ్డ ప్రమాదంలో ఉండటం చూసి ఆ తల్లి కోపం కట్టలు తెంచుకుంది. చేతికి దొరికిన కర్రతో చిరుతపులిని బలంగా కొట్టడం మొదలుపెట్టింది. పట్టు వదలకుండా చిరుతపై దాడి చేస్తూ, దానిని సవాలు చేసింది. ఆ ధాటికి బిడ్డ చిరుత పంజాల నుండి కింద పడిపోయాడు. వెంటనే ఆ మహిళ తన బిడ్డను ఎత్తుకుని పెద్దగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. జనసమూహాన్ని చూసి చిరుతపులి తిరిగి అడవిలోకి పారిపోయింది.
బాలుడి కంటికి తీవ్ర గాయాలు: గ్రామస్తుల సమాచారంతో సంజయ్ టైగర్ రిజర్వ్ అధికారులు, అటవీ శాఖ బృందం ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన బాలుడిని, తల్లిని ఆసుపత్రికి తరలించారు. చిరుత దాడిలో బాలుడి వీపుపై, ఒక కంటికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లి శరీరంపై కూడా అక్కడక్కడా గాయాలయ్యాయి.
మహిళా ధైర్యాన్ని మెచ్చుకున్న అటవీ శాఖ: చిరుతపులి ముందు ఆ మహిళ చూపిన ధైర్యం అసాధారణమైనది. మరెవరైనా అంత సాహసించలేరు. సమయస్ఫూర్తితో ఆమె బిడ్డ ప్రాణాలను కాపాడుకోగలిగింది. ఈ మహిళ సాహసాన్ని అధికారులు, గ్రామస్తులు కొనియాడుతున్నారు.
