రాజస్థాన్: పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఒక నవవధువు ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన రాజస్థాన్లో వెలుగుచూసింది. వధువు కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో, చివరకు వరుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఘటన రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో జరిగింది. భరత్పూర్ జిల్లా బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగలా భార్ గ్రామానికి చెందిన నారాయణ సింగ్ గుర్జర్ అనే యువకుడికి ఇటీవల వివాహం జరిగింది. అయితే, పెళ్లి కోసం వధువు కుటుంబానికి నారాయణ తరపు వారు రూ. 3 లక్షలు చెల్లించారు.
పెళ్లయిన 13 రోజులకే వధువు సునీత కనిపించకుండా పోవడంతో, నారాయణ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు బాధితుడు వివరించిన వివరాల ప్రకారం.. ధోల్పూర్ జిల్లాకు చెందిన హరి సింగ్ గుర్జర్ అనే వ్యక్తి ఈ సంబంధాన్ని కుదిర్చాడు. మార్చి 6న హరి సింగ్ తన పరిచయస్తుడైన మధ్యప్రదేశ్కు చెందిన రామ్ధన్ గుర్జర్ను పరిచయం చేసి, అతని సోదరి సునీతతో పెళ్లి ప్రతిపాదన ఉంచాడు. ఈ పెళ్లి కోసం రూ. 3 లక్షలు డిమాండ్ చేయగా, నారాయణ అందుకు అంగీకరించాడు.
మార్చి 9న హరి సింగ్, రామ్ధన్, జీతూలు సునీతను తీసుకుని నారాయణ ఇంటికి వచ్చారు. అక్కడ రూ. 3 లక్షలు తీసుకుని, పెళ్లి తంతు పూర్తి చేశారు. అనంతరం రామ్ధన్, హరి సింగ్, జీతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అసలు ఏం జరిగింది? మార్చి 22 సాయంత్రం 6 గంటల సమయంలో, నారాయణ సింగ్ మరుగుదొడ్డి కోసం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో సునీత ఇంట్లో ఒంటరిగా ఉంది. తిరిగి వచ్చి చూసేసరికి సునీత కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో, వరుడు వెంటనే ఆ మధ్యవర్తి హరి సింగ్కు, ఆమె సోదరుడు అని చెప్పుకున్న జీతూకి ఫోన్ చేశాడు. అయితే, “మేము పెళ్లి చేశాం, ఇక మాకేం సంబంధం?” అని వారు సమాధానమిచ్చారు. తిరిగి ఫోన్ చేస్తే బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో బాధితుడు 13 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి పేరుతో తమను నమ్మించి, రూ. 3 లక్షలు వసూలు చేసి మోసం చేశారని నారాయణ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ ఘటన వెనుక ఉన్న ముఠా కోసం విచారణ ముమ్మరం చేశారు.

Leave a Reply