న్యూఢిల్లీ (CUET, NEET అభ్యర్థుల డేటా లీక్): దేశంలో పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు మరియు అభ్యర్థుల డేటా భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేపర్ లీక్ వివాదాల మధ్య ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
జాతీయ ప్రవేశ పరీక్షలు మరియు బోర్డు పరీక్షలకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థుల వ్యక్తిగత డేటా ఇంటర్నెట్లో విక్రయించబడుతోంది. NEET, CUET వంటి పరీక్షలు రాసిన అభ్యర్థుల పేర్లు, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు మరియు తల్లిదండ్రుల పేర్లు వంటి గోప్యమైన సమాచారం కొన్ని వెబ్సైట్లలో కారుచౌకగా లభిస్తోంది.
దేశంలో ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (DPDP) చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో, ఈ అక్రమ వ్యాపారం విద్యార్థుల గోప్యత, భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, అడ్మిషన్ కన్సల్టెంట్లు విద్యార్థులను అడ్మిషన్ల కోసం టార్గెట్ చేయడానికి వీలుగా ఈ వెబ్సైట్లు వారికి డేటాను విక్రయిస్తున్నాయి. డేటాను విక్రయిస్తున్న కంపెనీలు దీన్ని చట్టబద్ధమే అంటుండగా.. ప్రతిరోజూ వస్తున్న అవాంఛిత (స్పామ్) కాల్స్, మెసేజ్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
రూ. 1000 నుంచి 10,000లకే పూర్తి వివరాలు
ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉన్న కొన్ని ప్రముఖ వెబ్సైట్లు (studentdataprovider.com, studentsdatabases.com, మరియు bulkstudentdata.com వంటివి) విద్యార్థుల డేతాతో వ్యాపారం చేస్తున్నాయి. ఇక్కడ డేటా పరిమాణం మరియు విద్యార్థుల రాష్ట్రాలు/నగరాల ఆధారంగా ధరలు నిర్ణయించబడ్డాయి. ఇవి కేవలం రూ. 1,000 నుండి మొదలై రూ. 10,000 వరకు ఉంటున్నాయి. అడ్మిషన్ల సీజన్లో వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించేందుకు, కళాశాలలు మరియు కన్సల్టెంట్లు ఈ వెబ్సైట్ల నుండి టోకు (బల్క్) ధరలకు డేటాను కొనుగోలు చేస్తున్నారు.
ప్రమాదంలో 15 లక్షలకు పైగా CUET విద్యార్థుల డేటా
studentdataprovider.com అనే వెబ్సైట్లో ‘CUET-2026 ఎగ్జామ్ డేటాబేస్’ పేరుతో ఒక లిస్టింగ్ ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ డేటాబేస్లో CUET పరీక్ష రాసిన 15 లక్షలకు పైగా అభ్యర్థుల పూర్తి రికార్డు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా, వినియోగదారులను నమ్మించడానికి ఈ వెబ్సైట్ 500 మంది విద్యార్థుల డేటాను ‘ఫ్రీ శాంపిల్’ గా కూడా షేర్ చేసింది. ఇందులో వారి అప్లికేషన్ నంబర్ మొదలుకొని పుట్టిన తేదీ, లింగం మరియు కోటా కేటగిరీల వంటి వివరాలను స్పష్టంగా చూడవచ్చు.
కొత్త DPDP చట్టం ఉల్లంఘన.. భారీ జరిమానాకు అవకాశం
విద్యార్థుల డేటాను ఇలా బహిరంగంగా విక్రయించడం దేశంలోని కొత్త ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (DPDP) చట్టం ఉద్దేశాలనే అపహాస్యం చేస్తోంది. ఈ చట్టం ప్రకారం, ఏ వ్యక్తిగత డేటానైనా వారి అనుమతి లేదా సమ్మతి లేకుండా వేరే ఏ ఇతర పని కోసం ఉపయోగించకూడదు. చట్టంలో ఇలాంటి ఉల్లంఘనలకు ఏకంగా రూ. 250 కోట్ల వరకు భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. అయితే, ఈ చట్టంలోని కఠిన నిబంధనలు 2027 సంవత్సరం నుండి అమలు కానున్నాయి. బహుశా అందుకే ఈ డేటా దొంగలు ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నారు.
చేతులెత్తేసిన NTA.. డేటా కంపెనీల వింత వాదన
ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందిస్తూ, తాము అభ్యర్థుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. తాము విశ్వవిద్యాలయాలతో కేవలం సురక్షితమైన మరియు ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్ (DigiLocker) లేదా API ప్లాట్ఫారమ్ ద్వారా మాత్రమే ఫలితాలను పంచుకుంటామని NTA పేర్కొంది. మరోవైపు, ఢిల్లీకి చెందిన ‘బల్క్ స్టూడెంట్స్ డేటా’ వంటి కంపెనీలు ఈ అక్రమ దందాను సమర్థిస్తూ.. మార్కెటింగ్ కోసం ఈ డేటాను ఉపయోగించడం చట్టవిరుద్ధం కాదని వింత వాదనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని చెబుతోంది.
