వైరల్ వీడియో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లా కర్వీ ప్రాంతం నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై ఇందులో తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
చిన్నారి విద్యార్థినులతో సదరు హెడ్ మాస్టర్ మసాజ్ చేయించుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. కర్వీలోని నయా బజార్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. స్కూలు గదిలో చాప వేసుకుని పడుకున్న టీచర్కు విద్యార్థినులు మసాజ్ చేస్తుండగా, ఆమె దర్జాగా పడుకుని ఉంది.
స్కూలు పిల్లలతో మసాజ్ చేయించుకున్న టీచర్ వీడియో ఆధారంగా సదరు మహిళ పేరు మధు కుమారి అని, ఆమె ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలని తెలుస్తోంది. విద్యార్థినులు తమ చేతులతో, కాళ్లతో ఆమెకు మసాజ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా, ఒక విద్యార్థిని చపాతీ కర్ర (రోలర్) తో కూడా మసాజ్ చేస్తుండటం గమనార్హం. ఆ సమయంలో టీచర్ తన మొబైల్ ఫోన్ వాడుతూ సేదతీరుతోంది. పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఈ దారుణం జరగడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విద్యాశాఖ చర్యలు ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. విద్యా వ్యవస్థకే ఇది మచ్చ అని చాలామంది మండిపడుతున్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని స్థానికులు అంటున్నారు.
ఈ వ్యవహారంపై విద్యాశాఖ స్పందిస్తూ.. సదరు టీచర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. “పాఠశాల పిల్లలతో మసాజ్ చేయించుకోవడం అత్యంత సిగ్గుచేటు. ఇటువంటి టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లల భద్రత, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు” అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply